హైదరాబాద్, ఫిబ్రవరి 25 : దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ వేదికగా నదుల పునరుజ్జీవం అంశంపై జాతీయసదస్సుకు శనివారం అంకురార్పణ జరుగనున్నది. ఈ సదస్సు హైదరాబాద్లో ప్రారంభమై ఆరునెలల పాటు దేశవ్యాప్తంగా కొనసాగి తిరిగి ఇక్కడే ముగియనున్నది. ఈ సందర్భంగా నదుల పునరుజ్జీవనంలో తెలంగాణ పాత్రను పరిశీలిస్తే.. నదుల పునరుజ్జీవానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బహుముఖ వ్యూహాలు సత్ఫలితాలు ఇస్తుండటమే కాకుండా, దేశానికే దిక్సూచిలా నిలుస్తున్నాయి. ఇసుక పాలసీ, మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు, ఇతర చర్యల ఫలితంగా నదులు కొత్త రూపును సంతరించుకొంటున్నాయి. నదీ ప్రవాహానికి ఇబ్బంది కలుగకుండా అక్రమ ఇసుక మైనింగ్పై రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకొన్నది. ఏజెన్సీల ద్వారా ఇసుక రవాణాను అప్పగించి, ఎంత మేరకు ఇసుక తవ్వాలో, అంత మేరకే తవ్వేలా చూస్తున్నది.
గోదావరి నదిని సహజంగా ఉంచేందుకు.. కొండపోచమ్మ సాగర్కు చేరిన నీటిని హల్దీ వాగులోకి పంపింది. ఆ నీరు అక్కడి నుంచి మంజీర నదిలో కలిసింది. అక్కడి నుంచి నిజాంసాగర్కు, తర్వాత గోదావరి నదిలో కలుస్తుంది. అలా ఆ నది పునరుజ్జీవనాన్ని పొందుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం మురుగు నీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేసి నదుల్లోని జీవజాతుల సమతుల్యత దెబ్బతినకుండా చూస్తున్నది. భారీగా మొక్కలను పెంచటంతో వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి. ఆ నీరు నదుల్లో కలిసేలా ఏర్పాట్లు చేసి నదికి సహజత్వాన్ని అందిస్తున్నది తెలంగాణ సర్కారు. నీటి సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలపై నీటి నిపుణులు, శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. స్కోచ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సీబీఐపీ) సంస్థల నుంచి జాతీయస్థాయి అవార్డులను అందుకొన్నది. అంతర్జాతీయ స్థాయిలోనూ మెప్పును పొందుతున్నది.