హైదరాబాద్ : నాణ్యమైన వైద్యం మాత్రమే కాదు, నాణ్యమైన రోగ నిర్ధారణ పరీక్షలు సైతం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నొస్టిక్ సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. పరీక్షల నిర్వహణ, ఫలితాల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నందుకు తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంట్రల్ ల్యాబ్కు మెడికల్ టెస్టింగ్ విభాగంలో నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ కాల్బ్రేషన్ లాబొరేటరీస్ (ఎన్ఏబీఎల్) సర్టిఫికేషన్ లభించింది.
దీనిపై ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన వైద్య సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు. డయాగ్నొస్టిక్ కేంద్రాలు పేదలకు వైద్య పరీక్షల భారం నుంచి ఉపశమనం కలిగిస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో అన్ని జిల్లాలో వీటిని ప్రారంభించి 57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు.