పటాన్చెరు, డిసెంబర్ 31: జర్నలిస్టుల జాతీయ స్థాయి ప్లీనరీని జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో నిర్వహించనున్నట్టు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. శనివారం ఆయన పటాన్చెరులోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్ను టీయూడబ్ల్యూజే జిల్లా నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ.. ఈనెల 8న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ మహాసభను ప్రారంభిస్తామని, అనంతరం కార్యవర్గ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశానికి తెలంగాణలోని వర్కింగ్ జర్నలిస్టులు పెద్ద ఎత్తున హాజరవుతారని పేర్కొన్నారు. అదే రోజు సాయంత్రం ప్లీనరీ మొదలవుతుందని చెప్పారు. 9,10వ తేదీల్లో ప్లీనరీ కొనసాగుతుందని అన్నారు. ఈ ప్లీనరీకి దేశంలోని 22 రాష్ర్టాల ఐజేయూ ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. చివరి రోజు నేషనల్ సెమినార్ ఆన్ మీడియా నిర్వహిస్తామని చెప్పారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు, ప్రెస్ కౌన్సిల్ చైర్మన్లు పాల్గొంటారని తెలిపారు. ఈ ప్లీనరీలో టీయూడబ్ల్యూజేను ఐజేయూలో విలీనం చేస్తామని ప్రకటించారు. ఈ ప్లీనరీకి సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. వీరితోపాటు న్యాయమూర్తులను కూడా పిలుస్తున్నామని చెప్పారు. ఆయన వెంట టీయూడబ్ల్యూజే సెక్రటరీ మారుతీసాగర్ తదితరులు ఉన్నారు.