హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల కోసం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని నేషనల్ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షహెజాది కొనియాడారు. గురువారం నాంపల్లిలో మైనార్టీ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్, ఎండీ కాంతి వెస్లీ, సంబంధిత అధికారులతో భేటీ అయ్యారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలు, వాటి పురోగతి, ఫలితాలపై చర్చించారు. అనంతరం షహెజాది మాట్లాడుతూ పేద మైనార్టీలకు అండగా నిలిచేలా తెలంగాణ పథకాలు ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.