మేడ్చల్ మల్కాజ్గిరి : ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీకి చెందిన 15 మంది సభ్యుల బృందం.. తెలంగాణలో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా మేడ్చల్ జిల్లాలోని కండ్లకోయ ఆక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణకు హరితహారం ద్వారా అమలు చేస్తున్న జంగల్ బచావో – జంగల్ బడావో కార్యక్రమాన్ని నేషనల్ డిఫెన్స్ కాలేజీ బృందానికి పీసీసీఎఫ్ ఆర్ఎమ్ డోబ్రియల్ వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరిత కార్యక్రమాలు, అటవీ పునరుద్ధరణపై డిఫెన్స్ కాలేజీ బృందం ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని జాతీయ భద్రతా కళాశాల బృందం అభినందించింది.