బాన్సువాడ టౌన్, అక్టోబర్ 26: బాన్సువాడ మాతా శిశు దవాఖానకు మరో మూడు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డులు వరించాయి. జాతీయ వైద్యారోగ్య నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ, అన్ని విభాగాల్లోనూ రోగులకు మెరుగైన సేవలందిస్తున్నందుకు గాను ముస్కాన్, లక్ష్య, ఎన్క్యూఏఎస్ అవార్డులు లభించాయి. ఇటీవల జాతీయ వైద్య బృందం పలుమార్లు బాన్సువాడ దవాఖానను సందర్శించి ఇక్కడ అందుతున్న సేవలు, పరిసరాల పరిశుభ్రత, ఇన్ఫెక్షన్ కంట్రోల్, బయో మెడికల్ వేస్టేజ్ తదితర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించింది. ఒక్కో విభాగానికి పాయింట్లను కేటాయించి కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది.
అన్ని విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందిస్తుండటంతో బాన్సువాడ మాతాశిశు దవాఖానకు 2023 సంవత్సరానికి ఒకేసారి మూడు జాతీయ అవార్డులు వరించాయి. ముస్కాన్, లక్ష్య అవార్డుల కింద ఏడాదికి రూ.6 లక్షలు, ఎన్క్యూఏఎస్ అవార్డు కింద సంవత్సరానికి రూ.10 లక్షల రూపాయల చొప్పున మూడేండ్లపాటు దవాఖానకు అందిస్తారని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. డాక్టర్లు, అన్ని విభాగాల సిబ్బంది కృషి వల్లే జాతీయ అవార్డులు వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. మూడు అవార్డులు రావడంతో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వైద్యులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.