హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): సింగరేణి థర్మల్ విద్యుత్తు సంస్థకు నీటి పొదుపులో మరోసారి ఉత్తమ బహుమతి లభించింది. మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం అవలంబిస్తున్న పర్యావరణహిత చర్యలకు గుర్తింపుగా జాతీయస్థాయిలో దక్షిణాది రాష్ట్రాల క్యాటగిరీలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో అత్యంత పొదుపుగా నీటిని వినియోగిస్తున్నందుకు ముంబైకి చెందిన ప్రముఖ మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ సంస్థ ఈ అవార్డును అందించింది.
న్యూఢిల్లీలో బుధవారం నిర్వహించిన జాతీయస్థాయి సదస్సులో సంస్థ అధ్యక్షుడు ఎస్ దాల్వి చేతుల మీదుగా థర్మల్ విద్యుత్తు కేంద్రం ఏజీఎం కేఎస్ఎన్ ప్రసాద్ బహుమతిని అందుకున్నారు. సాధారణంగా 500 మెగావాట్లు అంతకు ఎకువ స్థాయి గల థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో ఒక మెగావాట్ విద్యుత్తు ఉత్పాదనకు 3 క్యూబిక్ మీటర్ల వరకు నీటిని వినియోగించవచ్చని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిబంధన. కాగా.. సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రంలోని ప్రత్యేక ఏర్పాట్లు, చర్యలతో ఈ నీటి వినియోగం 2.69 క్యూబిక్ మీటర్ల వరకు మాత్రమే ఉంటున్నది. ఈ ప్రత్యేకతను గుర్తిస్తూ దక్షిణ భారతదేశంలోని సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని ఎంపిక చేశారు.