విద్యానగర్, డిసెంబర్ 21: కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు వైద్యులకు జాతీయ అవార్డు లభించింది. పేద ప్ర జలకు సామాజిక, ఉచిత వైద్య సేవలు అందించినందుకు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు(ఎలెక్టెడ్) డాక్టర్ బీఎన్ రావు, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎం విజయలక్ష్మి ఎంపికైనట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. ఈనెల 27, 28వ తేదీల్లో బీహార్లోని పాట్నాలో జరిగే ఐఎంఏ జాతీయ సదస్సులో ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. డాక్టర్ బీఎన్ రావు తన పేరిట స్థాపించిన బీఎన్ రావు హెల్త్ ఫౌండేషన్ ద్వారా ఉమ్మడి జిల్లాలోని 30 వేల మంది విద్యార్థులకు ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించి 7 వేల మంది రక్తహీనతతో బాధపడుతున్నట్టు గుర్తించారు. వీరికి ఐరన్ మాత్రలతోపాటు బెల్లం పట్టీలు, పండ్లు మూడు నెలల పాటు ఉచితంగా పంపిణీ చేశారు. కాగా సీనియర్ గైనకాలజిస్ట్, సంజీవని నర్సింగ్ హోం నిర్వాహకురాలు డాక్టర్ విజయలక్ష్మి నిర్వహించిన అనేక సామాజిక కార్యక్రమాలకు గాను జాతీయ స్థాయిలో బెస్ట్ సోషల్ యాక్టివిటీ అవార్డు దక్కింది.