నర్సాపూర్, డిసెంబర్ 4: తాను బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్లో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. సోమవారం ఆమె నర్సాపూర్లో మీడియాతో మాట్లాడుతూ.. కొందరు పనిగట్టుకొని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్లోనే ఉంటూ ప్రజాసేవ చేస్తానని పేర్కొన్నారు. తనను ఆదరించి విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. తనపై అసత్య ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు ఆమె పేర్కొన్నారు.