మోర్తాడ్(నిజామాబాద్) : ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు(corrupt person ) ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula) ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్(BRS) పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. ప్రధాని అవినీతిని ప్రశ్నించినందుకే తెలంగాణపై కక్ష కట్టారని, తప్పుడు కేసులతో ఎమ్మెల్సీ కవితను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ(Rahula Gandhi) లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం ద్వారా మోదీ తన రాక్షసత్వాన్ని, దురహంకారాన్ని చాటుకున్నారన్నారు. మోదీ ప్రధానమంత్రి ఆయ్యే నాటికి ఆదానీ ఆస్తి 50 వేల కోట్లు ఉండే. గత ఎనిమిదేళ్లలో 12 లక్షల కోట్లకు చేరిందని విమర్శించారు. అతడి బ్యాంకు రుణాలను కేంద్రం మాఫీ చేయడం వల్లే ఆదానీ ఆస్తి పెరిగిందని దుయ్యబట్టారు. ఆదానీ కారణంగా ఎల్ఐసీకి 60 వేల కోట్లు, ఎస్బీఐకి 70వేల కోట్లు నష్టమొచ్చిందని ఆరోపించారు.
వీటిని ప్రశ్నించిన సీఎం కేసీఆర్(KCR) తెలంగాణపై మోదీ కక్ష కట్టిండని పేర్కొన్నారు. ‘ లిక్కర్ కేసులో వందకోట్లు ఎవరు తీసుకున్నారో ఇంకా తేలనేలేదు. అటువంటిది కవితపై కేసు నమోదు చేసి విచారణ పేరిట పొద్దన పిలిచి రాత్రి వరకు ఉంచుతున్నారు. మళ్లీ నోటీసులు జారీ చేయడం, మళ్లీ విచారణకు పిలిపించడం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు’. ఎల్ఐసీ, ఎస్బీఐకి వచ్చిన నష్టంపై ఆదానీని ఎందుకు ప్రశ్నించడంలేదని నిలదీశారు.
పసుపు రైతుల ఉసురు తగిలింది..
ఎంపీ అరవింద్ కుటుంబానికి పసుపురైతుల ఉసురు తగిలిందని వారి ఇంట్లో జరుగుతున్న ఫ్యామిలీ వార్ను ఉద్దేశించి మంత్రి వేముల అన్నారు. అరవింద్ వల్ల బాండ్ పేపర్ వాల్యూ కూడా పోయిందన్నారు. పాపం పెద్దాయన డి.శ్రీనివాస్ పరిస్థితి చూస్తే బాధనిపిస్తుంది. ఎంపీ వల్ల ఇంట్లో కన్నవారికి మనశ్శాంతి లేదు, ఓట్లేసిన ప్రజలకూ మనశ్శాంతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక్కరికి కూడా ప్రధానమంత్రి సహాయనిధి ఇప్పించని ఎంపీ మనకేందుకు అని ప్రజలు ఆలోచించాలని కోరారు. రేవంత్రెడ్డి, బండి సంజయ్ బట్టేబాజ్లు అని, ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. శాసనమండలి డిఫ్యూటీ చైర్మన్, జిల్లా ఇన్చార్జి బండ ప్రకాశ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.