హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): ఈ నెల 20లోగా 17 వేల మంది ఎన్హెచ్ఎం (నేషనల్ హెల్త్ మిషన్) ఉద్యోగులకు ఇస్తామన్న మూడు నెలల పెండింగ్ వేతనాలను చెల్లించకపోతే 22 నుంచి యథావిథిగా సమ్మెకు దిగుతామని ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నేత నరసింహ తెలిపారు. ఇటీవల తాము ఇచ్చిన సమ్మె నోటీసుపై సోమవారం చర్చలు జరిగాయని, ఈ సందర్భంగా మూడు నెలల పెండిగ్ వేతనాలను ఈ నెల 20లోగా చెల్లిస్తామని ఎన్హెచ్ఎం డైరెక్టర్ ఆర్వీ కర్ణన్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
బడ్జెట్తో సంబంధం లేకుండా ఉద్యోగుల జీతభత్యాలు చెల్లించాలని తాము కమిషనర్ను కోరినట్టు తెలిపారు. తెలంగాణకు రావాల్సిన రూ.380 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేశ్, నేతలు తోట రామాంజనేయులు, బడేటి వనజ, శ్యామల, పద్మ, జ్యోతి, పీ పద్మ, రాజేశ్వరి, బాపు యాదవ్, బాలసుబ్రమణ్యం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.