హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్ శాసననసభలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సతీమణి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి స్పందించారు. తనపై అనుచిత వ్యాఖ్యలపట్ల నిరసన వ్యక్తంచేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ‘నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లి, తోబుట్టువు, కూతురికి జరిగినట్టుగా భావించి.. నాకు అండగా నిలబడటం జీవితంలో మర్చిపోలేను. చిన్నతనం నుంచి అమ్మానాన్న మమ్మల్ని విలువలతో పెంచారు. నేటికీ మేము వాటిని పాటిస్తున్నాం. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలి. కష్టాలు, ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడాలి. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదు’ అని శుక్రవారం ఓ ప్రకటనలో భువనేశ్వరి పేర్కొన్నారు.