సంగారెడ్డి, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో పరిష్కారాలు చూపేందుకు ఐఐటీయన్లు ప్రాధాన్యమివ్వాలని నన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (సింగపూర్) ప్రెసిడెంట్ ప్రొఫెసర్ సుబ్ర సురేశ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో శనివారం 11వ స్నాతకోత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురికి మెడల్స్ అందజే శారు. ప్రొఫెసర్ సుబ్ర సురేశ్ మాట్లాడుతూ.. భౌగోళిక వాతావరణ మార్పులు, యుద్ధం, విపత్కరమైన రాజకీయ పరిణామాలతోపాటు అనేక సవాళ్లను ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్నదన్నారు. వీటిని పరిష్కరించేందుకు ఐఐటీయన్లు తమవంతు పాత్ర పోషించాలని సూచించారు. కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ బీవీఆర్ మోహన్రెడ్డి, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి పాల్గొన్నారు.