బంజారాహిల్స్, నవంబర్ 13: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక నిందితుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సన్నిహితుడు నందుకుమార్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్లోని ఫిలింనగర్లో లీజు పేరుతో తీసుకున్న స్థలంలో అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టి, యజమానులపైనే కోర్టుకెక్కారు. ఫిలింనగర్ రోడ్ నంబర్ 1లో సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్బాబు, హీరో వెంకటేశ్కు 2,000 గజాల స్థలం ఉన్నది.
దానిని దగ్గుబాటి కుటుంబం నుంచి లీజుకు తీసుకొన్న నందుకుమార్.. సురేశ్బాబుకు చెందిన స్థలంలో డబ్ల్యూ 3 హాస్పిటాలిటీ పేరుతో, వెంకటేశ్కు చెందిన స్థలంలో ఫిల్మీ జంక్షన్ పేరుతో హోటళ్లు ఏర్పాటు చేశాడు. అదే స్థలంలో కొంత ఖాళీ స్థలంలో ఐస్క్రీమ్ స్టోర్తోపాటు మరోస్టోర్ ప్రారంభించాడు. సురేశ్బాబు స్థలాన్ని కొనుగోలు చేస్తానని నందుకుమార్ ఒప్పందం చేసుకొని డబ్బులు ఇవ్వకపోవటంతో.. దానిని ప్రమోద్కుమార్ అనే వ్యక్తికి అమ్మేందుకు సురేశ్బాబు అగ్రిమెంట్ చేసుకొన్నారు.
దీంతో నందుకుమార్ కోర్టుకు వెళ్లారు. ఫిల్మీ జంక్షన్ పేరుతో ఉన్న రెస్టారెంట్ను నందుకుమార్ ఇటీవల డెక్కన్ కిచెన్గా మార్చి నడిపిస్తున్నాడు. కాగా సురేశ్బాబు తన స్థలాన్ని ఇటీవల కొడుకు దగ్గుబాటి రానా పేరుమీదకు మార్చారు. లీజు గడువు ముగిసినా స్థలాన్ని రానాకు అప్పగించకుండా నందుకుమార్ వేరేవాళ్లకు అద్దెకు ఇవ్వడంతోపాటు అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టాడు. రానా ఫిర్యాదు మేరకు ఆదివారం జీహెచ్ఎంసీ సిబ్బంది అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేసింది.