నాంపల్లి కోర్టులు, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డీసీపీ రాధాకిషన్రావును 10 రోజులపాటు తమకు అప్పగించాలని కోరుతూ పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్పై మంగళవారం నాంపల్లిలోని 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే నాథుడే కరువయ్యాడని, సాక్షుల వాంగ్మూలాలు లేకుండానే కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని వారి తరఫు న్యాయవాది వాదించారు.
కోర్టు ఉత్తర్వులను పోలీసులు బేఖాతరు చేస్తున్నారని, ఇప్పటివరకు సేకరించిన సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని తెలిపారు. దీంతో వాటిని ఎందుకు సమర్పించలేదని మెజిస్ట్రేట్ కన్నయ్యలాల్ ఏసీపీ వెంకటగిరిని ప్రశ్నించారు. ఐపీసీలోని 409 సెక్షన్ రాధాకిషన్రావుకు వర్తించదని, సాక్ష్యాధారాలను ఆయన ధ్వంసం చేయకపోయినప్పటికీ ఈ సెక్షన్ను జోడించడం విచిత్రంగా ఉన్నదని వ్యాఖ్యానించారు.
దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పందిస్తూ.. జర్నలిస్టులు, న్యాయాధికారులు, రాజకీయ నేతలు, వాపారులు, సామాజిక సేవకుల ఫోన్ల ట్యాపింగ్కు రాధాకిషన్రావు సహకరించాడని తెలిపారు. టెలిగ్రాఫ్ చట్టంలోని 26(2) సెక్షన్ను ఈ కేసుకు జోడించే అధికారం కోర్టుకు ఉంటుందని పీపీ వివరించారు. తీర్పును బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు మేజిస్ట్రేట్ ప్రకటించారు.