Telangana | కొత్తగా రెక్కలు తొడిగిన రాష్ట్రం తెలంగాణ. కానీ, ఇక్కడికి పారిశ్రామికవేత్తలు రెక్కలు కట్టుకొని వాలిపోతున్నారు ఎందుకు? రాష్ట్రంలోని పరిస్థితులను చూసిపోదామని వచ్చిన బిజినెస్మ్యాన్లు, ఇన్వెస్టర్లుగా మారిపోతున్న కారణాలేమిటి? అన్న ప్రశ్నలకు కిటెక్స్ గార్మెంట్స్ లిమిటెడ్ ఎండీ సాబూ ఎం.జాకబ్ విస్పష్ట సమాధానం ఇచ్చారు.
‘మా పరిశ్రమ నెలకొల్పడానికి ఇక్కడి పరిస్థితులను అంచనా వేసే ఉద్దేశంతో వచ్చిన నేను, ఫ్లైట్ దిగిన ఆరు గంటల్లోనే పెట్టుబడి పెట్టాలన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చాను. అందుకు కారణం తెలంగాణ ప్రభుత్వ విధానమే. కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ మంత్రిత్వం తెలంగాణ బలాలు. ఇక్కడి సుస్థిర ప్రభుత్వం, స్పష్టమైన విధాన నిర్ణయాలు… పెట్టుబడుల కోసం వచ్చే పారిశ్రామికవేత్తలకు వరాలు. రాష్ట్రంలో ఉపాధి కల్పన గురించి తపన కలిగిన తెలంగాణ నాయకత్వం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది’ అని చెబుతున్నారాయన.
తెలంగాణలో రూ.3,000 కోట్ల పెట్టుబడితో 50వేల ఉద్యోగాలు సృష్టించాలనే సంకల్పంతో కిటెక్స్ సంస్థ రెండు టెక్స్టైల్ పరిశ్రమలను నెలకొల్పుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పారిశ్రామికరంగం, ప్రభుత్వ విధానాలు, ఇతర రాష్ర్టాల్లో పరిస్థితులపై సాబూ ఎం.జాకబ్తో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ…
దాదాపు 55 ఏండ్ల వ్యాపార చరిత్ర మీది. తెలంగాణలో కొత్త ప్రస్థానం ఎలా మొదలైందో చెబుతారా?
1968లో కేరళలో కిటెక్స్ సంస్థను ప్రారంభించాం. టెక్స్టైల్, కుకింగ్, స్పైసెస్, అప్పెరల్, అల్యూమినియం, స్కూల్బ్యాగ్స్ తదితర వస్తువులు ఉత్పత్తి చేస్తున్నాం. దాదాపు 15,000 మంది ప్రత్యక్ష ఉపాధి పొందుతున్నారు. కేరళలో రాజకీయ పరిస్థితులు అంత బాగాలేవు. చాలా కంపెనీలు ఆ రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయి. నేనూ మా సంస్థను అక్కడి నుంచి తరలించాలని భావిస్తుండగా శ్రీలంక నుంచి ఆహ్వానం అందింది. ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ ఇలా దాదాపు 12 రాష్ర్టాల నుంచి పిలుపులు అందాయి. అదే సమయంలో తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఫోన్ చేశారు. అయితే, అందరి మాటల్లో, కేటీఆర్ పలకరింపులో ఎంతో వ్యత్యాసం ఉందనిపించింది. అందరూ మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి అన్నారు. కేటీఆర్ మాత్రం.. ‘ఒకసారి మా రాష్ర్టానికి రండి, చూడండి’ అన్నారు. కొవిడ్ సమయం కావడంతో ‘రావడం ఎలా?’ అని సందేహాన్ని వెలిబుచ్చాను. ‘ప్రైవేట్ జెట్ పంపిస్తాను’ అన్నారాయన. నేను షాకయ్యా! ‘మీరు సీరియస్గానే అంటున్నారా?’ అని అడిగా! ‘అవును! మీరు 24 గంటల్లోగా కన్ఫర్మ్ చేస్తే.. నేను ఫ్లైట్ ఏర్పాటు చేస్తాను’ అన్నారు. చాలావండర్ అనిపించింది. ఆయన మాటతీరు అడ్మైర్ చేసింది. తెల్లారేసరికల్లా, నేను ఓకే చెప్పడం.. వెంటనే ఫ్లైట్ పంపడం జరిగిపోయాయి.
తెలంగాణకు వచ్చాక, ఇక్కడ మిమ్మల్ని ఆకర్షించిన అంశం ఏమిటి?
కేటీఆర్ ఆహ్వానంతో మరుసటి రోజే తెలంగాణకు చేరుకున్నాను. కేటీఆర్ మాత్రం నా రాక కోసం ఎదురుచూస్తుండటం ఆశ్చర్యం కలిగించింది. నేను వివిధ రాష్ర్టాల్లో, జాతీయస్థాయిలో చాలామంది నాయకులను చూశాను. కానీ, ఇంత పంక్చువల్ లీడర్ని చూడలేదు. కేటీఆర్తో సమావేశమైన తర్వాత వివిధ అంశాలపై ఆయన స్పందించిన తీరు ఎంతో ఆకట్టుకున్నది. ఆయన ఒక పొలిటికల్ లీడర్ కన్నా.. ప్రొఫెషనల్ పర్సన్ అనిపించింది. నేను చాలా ఏండ్లుగా కేరళ ముఖ్యమంత్రులు, వివిధ నాయకులతో మాట్లాడా! ఒక సంస్థ బలోపేతం అయితే కలిగే ఉద్యోగ అవకాశాలు, రాష్ర్టానికి లభించే ప్రయోజనం ఏంటో వారికి అర్థమైనట్టు అనిపించలేదు. కానీ, కేటీఆర్ వీటన్నిటినీ అర్థం చేసుకున్నారు. చాలా ప్రొయాక్టివ్గా ఉంటారు. మనం ఏది అడిగినా వెంటనే సమాధానమివ్వగలరు. సమస్యకు పరిష్కారమూ చూపగలరు.
పెట్టుబడి పెట్టాలన్న ఆలోచనతోనే తెలంగాణలో అడుగుపెట్టారా?
లేదు లేదు! అప్పటికింకా పెట్టుబడిపై ఎలాంటి నిర్ధారణకూ రాలేదు. ఎందుకంటే, రాష్ట్రంలో పరిస్థితులు నాకు తెలియదు. కానీ, ఇక్కడికి వచ్చాక, కేటీఆర్తో మాట్లాడాక తెలంగాణలో ఇన్వెస్ట్ చేస్తే సురక్షితంగా ఉంటుందని అర్థమైంది. కేటీఆర్తో భేటీ అయ్యాక సైట్ చూసేందుకు వరంగల్కు వెళ్లాం. అధికారులు చాలా పాజిటివ్గా సహకరించారు. అదేరోజు రాత్రి వెయ్యి కోట్ల పెట్టుబడితో టెక్స్టైల్ అప్పెరల్ పరిశ్రమ నెలకొల్పుతామని ప్రకటించాను. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎంత నమ్మకం ఉంటే ఈ ప్రకటన చేసి ఉంటానో అర్థం చేసుకోవచ్చు. కేటీఆర్ స్పందించిన తీరు, ఆయన మాకు కలిగించిన నమ్మకం వల్లే ఆరు గంటల్లోనే భారీ పెట్టుబడికి ముందుకొచ్చాం. ఒకరోజు పర్యటన కోసమే ఇక్కడికి వచ్చిన నేను ఈ ప్రభుత్వంపై నమ్మకం కుదరడంతో నా ప్రయాణాన్ని ఒకరోజు వాయిదా వేసుకున్నా. మర్నాడు హైదరాబాద్ చుట్టూ మరికొన్ని పారిశ్రామికవాడలు సందర్శించాను. ఇందులో భాగంగా సీతారాంపూర్కు కూడా వెళ్లాను. వరంగల్తోపాటు సీతారాంపూర్లోనూ ఇన్వెస్ట్ చేయాలని నిశ్చయించుకున్నాను. రెండుచోట్లా కలిపి రూ.3,000 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని సంస్థ నిర్ణయించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 50,000 ఉద్యోగావకాశాలు కల్పించాలని భావించాం. ఉద్యోగుల్లో 80 శాతం మహిళలే ఉంటారు. ఈ రెండు పరిశ్రమల్లో కలిపి రోజుకు 22 లక్షల దుస్తులు తయారు చేయనున్నాం.
పరిశ్రమ నిర్మాణం చాలా వేగంగా సాగుతున్నది. ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమవుతుంది?
వరంగల్ ప్లాంట్ నిర్మాణం పూర్తయ్యింది. ఈ ఏడాది డిసెంబర్లో ఉద్యోగుల నియామకం చేపట్టనున్నాం. రానున్న జనవరిలో మిషినరీ వస్తుంది. మార్చిలోగా ఉత్పత్తి ప్రారంభమవుతుంది. సీతారాంపూర్లో 2024 డిసెంబర్ కల్లా ఉత్పత్తి మొదలు పెడతాం. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఈ టెక్స్టైల్ పరిశ్రమలు నెలకొల్పుతున్నాం. సీతారాంపూర్లో భారీ బిల్డింగ్ నిర్మిస్తున్నాం. ప్రపంచ తయారీ పరిశ్రమల్లో ఇది అతి పొడవైన భవనం అవుతుంది. ఒక భవనం పొడవు 1,350మీటర్లు ఉంటుంది. ఇటువంటివి మూడు భవనాలు ఉంటాయి. అన్నీ కలిపితే నాలుగు కిలోమీటర్ల పొడవుంటాయి. ఇది ప్రపంచం మొత్తంలోనే అతి పొడవైన మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అవుతుంది. ప్రస్తుతం అమెరికా టెక్సాస్లో టెస్లా భవనం పొడవు 1,160మీటర్లు. దానికన్నా సుమారు 190మీటర్లు ఎక్కువ పొడవున్న భవనం మేం నిర్మిస్తున్నాం. ఈ నిర్మాణం గిన్నిస్ రికార్డ్ కాబోతున్నది.
తెలంగాణలో పారిశ్రామికరంగం పురోగతి ఎలా ఉన్నది?
ప్రభుత్వ ప్రోత్సాహంతో తెలంగాణలో పారిశ్రామికరంగం దూకుడుగా ముందుకుసాగుతున్నది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో ఇది సాధ్యమైంది. నేను సీతారాంపూర్ ఇండస్ట్రియల్ పార్క్ను సందర్శించినప్పుడు.. చుట్టూ ఉన్న ప్రాంతం ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలతో బుక్ అయిందని, మాకు అవసరమైనంత భూమి లేదని చెప్పారు. అక్కడికి 8 కి.మీ.ల దూరంలోని ప్రాంతాన్ని ఖరారు చేశాం. నేను ఇక్కడ ఎన్నో ఇండస్ట్రియల్ పార్క్లను చూశాను. రానున్న రోజుల్లో తెలంగాణ దేశంలోనే ఇండస్ట్రియల్ హబ్గా మారుతుందనడంలో సందేహం లేదు. దక్షిణాదిలో తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ర్టాల్లో భారీ సర్వే చేశాం. పెట్టుబడులకు అత్యుత్తమ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
ఈ ప్రగతి ఎలా సాధ్యమైందని మీరు భావిస్తున్నారు?
ఈ పదేండ్లలో పారిశ్రామికరంగం మాత్రమే కాదు వ్యవసాయం, మౌలిక సదుపాయాలు ఇలా ఏ రంగం తీసుకున్నా తెలంగాణ అద్భుతమైన వృద్ధి సాధించింది. ఇది ఇతర రాష్ర్టాల రాజకీయ నాయకులకు కనువిప్పులాంటిది. కేసీఆర్, కేటీఆర్ లాంటి బలమైన నాయకత్వం లేకుంటే ఇంత వృద్ధి సాధించడం అసాధ్యం. రాష్ట్ర పురోగతికి ఇక్కడి రాజకీయ స్థిరత్వం ప్రధాన కారణం. కర్ణాటకనే తీసుకోండి.. మొన్నటి దాకా బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి. తమిళనాడులోనూ ఐదేండ్లకోసారి ప్రభుత్వం మారుతుంటుంది. కేరళలోనూ ఎప్పుడైనా.. ఏదైనా జరగొచ్చు. నా అంచనా ప్రకారం మరో పదేండ్ల వరకు తెలంగాణలో ఎలాంటి మార్పు ఉండదు. ఏ పరిశ్రమకైనా మొదటి పదేండ్లు చాలా కీలకం. సంస్థ కుదురుకునే వరకు ఎలాంటి రాజకీయ అస్థిరత ఉండకూడదు. అందుకే ఇన్వెస్టర్లు రాజకీయ సుస్థిరతకు అంత ప్రాధాన్యం ఇస్తారు. తెలంగాణ రాజకీయ స్థిరత్వంతోపాటు మంచి వర్కర్స్ ఉన్నారు. ఇక్కడి ప్రజలు స్నేహశీలురు. ముఖ్యంగా రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఢోకా లేదు.
తెలంగాణలో అన్ని రంగాలకూ నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నారు! ఇతర రాష్ర్టాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి?
విద్యుత్ సరఫరా, నీటి వసతి పరిశ్రమలకు చాలా అవసరం. కరెంటు సరిగ్గా రాకపోతే ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ర్టాలు కరెంట్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇక్కడ ఆ సమస్య లేదు. మేం ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలకు రెండు లైన్ల నుంచి కనెక్షన్లు ఇచ్చారు. ఒక లైన్ ఫెయిల్ అయినా ఇబ్బంది రావొద్దని స్టాండ్బై కనెక్షన్ ఇచ్చారు. 24 గంటల విద్యుత్ సరఫరా పారిశ్రామికవేత్తలకు, కార్మికులకు ప్రయోజనం. మున్సిపల్ నీటితోపాటు మూడు రకాల నీటి వనరులు సమకూర్చారు.
ఇతర పారిశ్రామికవేత్తలతో మీరు భేటీ అవుతుంటారు కదా! తెలంగాణలో మీ అనుభవాలను ఎవరితోనైనా పంచుకున్నారా?
ఇంతమంచి ఆతిథ్యం గురించి చెప్పకుండా ఎలా ఉంటాను! నాకు తెలిసిన పారిశ్రామికవేత్తలను తెలంగాణకు రావాలని చెప్పాను. దుబాయ్కి చెందిన ఫైర్ ఎక్విప్మెంట్, ఫైర్ ఇంజన్ల తయారీ సంస్థ న్యాఫ్కో ప్రతినిధులను ఇక్కడ ఇన్వెస్ట్ చేయాల్సిందిగా కోరాను. వారు ఇప్పటికే రూ.1,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. ఇన్వెస్ట్మెంట్ పెంచాలని చెప్పాను కూడా! రూ.3,000 కోట్లకు పెంచే అవకాశం ఉంది. అమెరికా, కువైట్ తదితర ప్రాంతాల్లోని బిజినెస్ పీపుల్కూ చెప్పాను. ఎన్నికల తర్వాత వాళ్లు ముందుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వంపై ఎంతో నమ్మకం ఉంటేగానీ లులూ కంపెనీ ముందుకురాదు! బీఆర్ఎస్ ప్రభుత్వం పారిశ్రామిక విధానాలు ఇలాగే కొనసాగిస్తే దేశంలో పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా ఎదుగుతుంది అనడంలో సందేహం లేదు.
ఇక్కడి సింగిల్విండో విధానానికి, ఇతర రాష్ర్టాల్లో పరిస్థితులకు వ్యత్యాసం?
ప్రతి రాష్ట్రంలో సింగిల్ విండో అని చెబుతారు కానీ, దాని వెనుక 100 విండోలు ఉంటాయి. తెలంగాణ మాత్రం ఒక్కటే సింగిల్ విండో ఉంటుంది. ప్రభుత్వం విధానాలు పక్కాగా అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైంది. మూడునాలుగేండ్లుగా తెలంగాణ వేగంగా అభివృద్ధి సాధిస్తున్నది. కేసీఆర్, కేటీఆర్ ఉన్నంత వరకు ఇది ఇలాగే కొనసాగుతుందని బలంగా నమ్ముతున్నాను.
యూఎస్కు ఎగుమతి
మా ఉత్పత్తులు వంద శాతం యూఎస్ మార్కెట్కు ఎగుమతి అవుతాయి. సుమారు రూ.4,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం మన రాష్ర్టానికి వస్తుంది. ఈ మొత్తం తెలంగాణలోనే ఖర్చవుతుంది. వరంగల్లో మేము పరిశ్రమ ప్రారంభించిన తరువాత అక్కడికి పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. మరో ఆరు నెలల్లో అక్కడ స్థలం దొరకడం కూడా కష్టం. మరో విషయం, ఇతర రాష్ర్టాల్లో అధికారుల నుంచి కూడా సమస్యలు ఉత్పన్నం అవుతుంటాయి. ఇక్కడ ఆ ఇబ్బందీ లేదు. నాయకత్వం బలహీనంగా ఉంటే అధికారుల డామినేషన్ ఉంటుంది. ఇక్కడ ఆ పరిస్థితి లేదు.
తక్షణ స్పందన
ఇతర రాష్ర్టాల్లో పాలకులు ఏదో ఫార్మాలిటీ కోసం మాత్రమే పారిశ్రామికరంగాన్ని ప్రోత్సహిస్తారు తప్ప వారిలో చిత్తశుద్ధి ఉండదు. ప్రారంభోత్సవాలకు వచ్చి వెళ్లిపోతారు. ఇక్కడ అలా కాదు! ఏదైనా సమస్య ఉండి కేటీఆర్కు వాట్సాప్ మెసేజ్ పెడితే.. రెండు, మూడు నిమిషాల్లో స్పందన వస్తుంది. దీన్ని బట్టి పారిశ్రామికరంగం పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధి ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు.
మాటంటే మాటే..
అమెరికాలో కూడా రాష్ర్టాల మధ్య పోటీ ఉంటుంది. వారు కూడా పెట్టుబడిదారులను ఆహ్వానిస్తారు. భారత్లో రాష్ర్టాల మధ్య చాలా పోటీ ఉంది. అయితే, చాలా రాష్ర్టాలు చేసిన వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమవుతాయి. ఉత్తుత్తి వాగ్దానాలతో ఒకటీ, రెండూ పరిశ్రమలు వస్తాయేమో కానీ, వ్యాప్తి ఉండదు. అందుకే, పెట్టుబడులను ఆకర్షించడంలో అవి విఫలమవుతున్నాయి. తెలంగాణలో ఆ పరిస్థితిలేదు. ఇక్కడ మాటంటే మాటే! మరోవిషయం, ఒకసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం కుదరదు. అందుకే, పెట్టుబడి పెట్టేముందు చాలా ఆలోచించి నమ్మకం కుదిరాకే ముందుకొస్తారు.
పత్తి రైతుకు దన్ను
తెలంగాణ పత్తి ఉత్పత్తిలో మూడోస్థానంలో ఉన్నది. ఇక్కడి కాటన్ మేలి రకం. దురదృష్టం ఏంటంటే.. గుజరాత్, తమిళనాడు తరహా వస్త్ర పరిశ్రమలు, స్పిన్నింగ్ మిల్లులు లేక ఇక్కడి కాటన్కు గుర్తింపు రావడం లేదు. ఇక్కడ అధ్యయనం తర్వాత కాటన్ ప్రాసెస్ను మెకనైజింగ్ చేయాలనుకున్నాం. ప్రస్తుతం మ్యాన్యువల్గా జరుగుతున్నది. ఈ విషయం రైతులతో, మంత్రి కేటీఆర్తో చర్చించాను. రైతులకు మంచి ధర ఇప్పించాలని కేటీఆర్ అనుకుంటున్నారు. దీనివల్ల కాటన్ ఉత్పత్తి పెరగడమే కాకుండా తక్కువ ఖర్చుతో ప్రాసెసింగ్ అవుతుంది. తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న కాటన్లో 12-15శాతం వరకు మేం వినియోగించుకుంటాం. తద్వారా రైతులకు ప్రయోజనం కలుగుతుంది.
ఎక్కడికో వెళ్లడం ఎందుకు?
సీతారాంపూర్లో 250 ఎకరాల్లో, వరంగల్లో 185 ఎకరాల్లో పరిశ్రమలు నెలకొల్పుతున్నాం. విద్యుత్, నీరు తదితర మౌలిక సదుపాయాలు, ముడిసరుకు, కార్మికులకు తెలంగాణలో కొదవలేదు. అంతేకాదు, పారిశ్రామికవేత్తలకు కావాల్సిన అన్ని వస్తువులు బాయిలర్, కంట్రోల్ ప్యానల్స్, కేబుల్స్, ట్రాన్స్ఫార్మర్లు, సిమెంట్, స్టీల్ తదితర అన్నిరకాల వస్తువులు ఇక్కడే తయారవుతున్నాయి. ఇన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాక వేరే ప్రాంతానికి నేను ఎందుకు పోవాలి?
– కిశోర్ శుక్లా