Photo Journalist Rajesh | హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ)/చాదర్ఘాట్: నమస్తే తెలంగాణ సీనియర్ ఫొటో జర్నలిస్టు నర్రె రాజేశ్ (45) హఠాన్మరణం చెందారు. హైదరాబాద్లోని తన నివాసంలో శనివారం ఉదయం అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబసభ్యులు స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ రాజేశ్ను పరీక్షించిన డాక్టర్ ఛాతినొప్పికి గురయ్యాడని, మెరుగైన చికిత్స కోసం వెంటనే దవాఖానకు తరలించాలని సూచించారు. డాక్టర్ సూచన మేరకు యశోద దవాఖానకు తరలించి, అక్కడ చికిత్స అందిస్తుండగానే రాజేశ్ తుదిశ్వాస విడిచారు. భౌతికకాయాన్ని సైదాబాద్కాలనీలోని ఆయన నివాసానికి తరలించారు. రాజేశ్కు భార్య లావణ్య, కూతురు శివాణి, కుమారుడు వర్శిత్ ఉన్నారు.
మృతి విషయం తెలిసిన వెంటనే తెలంగాణ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, నమస్తే తెలంగాణ సంపాదకుడు తిగుళ్ల కృష్ణమూర్తి, తెలంగాణ టుడే ఎడిటర్ కే శ్రీనివాస్రెడ్డి, బ్యూరో చీఫ్ ఓరుగంటి సతీశ్, చీఫ్ ఫొటో జర్నలిస్ట్ చీఫ్ ఏ గంగాధర్, వివిధ పత్రికల సీనియర్ జర్నలిస్టులు, ఫొటో జర్నలిస్టులు రాజేశ్ నివాసానికి చేరుకొని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. రాజేశ్ మృతిపట్ల సంతాపం ప్రకటించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆత్మీయుల సందర్శన అనంతరం రాజేశ్ భౌతికాయానికి సైదాబాద్కాలనీలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు ముగిశాయి.
కేటీఆర్, హరీశ్, కవిత, సంతోష్ సంతాపం
నమస్తే తెలంగాణ సీనియర్ ఫొటో జర్నలిస్టు రాజేశ్ మృతి పట్ల బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్కుమార్, మాజీ మంత్రి నిరంజన్రెడ్డి, మాజీ ఐఏఎస్ కేవీ రమణాచారి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజేశ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని ప్రకటించారు.