కేసీఆర్ అనే మూక్షరాల శక్తి లేకపోతే, టీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఈ రోజు రాష్ట్రంలో మాట్లాడుతున్న ఎవరికైనా పదవులు లేవు.. చివరికి నాతో సహా. రాష్ట్రం సాధించిన ఈ 8 ఏండ్లల్లో ఉద్యమం ఆగలేదు. అభివృద్ధి రూపంలో కొనసాగుతున్నది. దేశంలో 75 ఏండ్లల్లో ఏ రాష్ట్రం, ఏ ప్రభుత్వం చేయని అసాధారణమైన అద్భుతాలు కేసీఆర్ ఆవిష్కరించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై ఇంకా వలసవాద పెత్తనమేందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం పుట్టుకనే సవాల్ చేసిన ప్రధాని నరేంద్రమోదీ నూకలు ఇక్కడ చెల్లాలా? నా ప్రజలను నూకలు తినండి అన్నవారి తోకలు కట్ చేయొద్దా? అని గర్జించారు. బీజేపీని గెలిపించేందుకే వైఎస్ షర్మిల, ప్రవీణ్ కుమార్ పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని ఏ దేవుడు చెప్పాడని నిలదీశారు. కాంగ్రెస్, ఆ పార్టీ నేత రాహుల్గాంధీ బలహీనతలే బీజేపీకి, మోదీకి బలంగా మారాయని విమర్శించారు. టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను టీఆర్ఎస్ ఏ మేరకు సాధించింది?
తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాసైన తర్వా రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీకి ధన్యవాదాలు చెప్పేందుకు వెళ్లాం. అప్పుడు ఆయన ఒక మాటన్నారు. ‘చంద్రశేఖర్.. ఒక మనిషి తన జీవితంలో నిర్దేశించుకొన్న లక్ష్యాన్ని సాధించటమే గొప్ప విషయం. అందులో మీరు ఎంచుకున్న లక్ష్యం చాలా కష్టమైనా సాధించారు. ఆ రాష్ర్టానికి మీరే నాయకత్వం వహించే అవకాశం రావడం అసాధారణ అంశం. ఒక జీవితంలో రెండు అవకాశాలు మీకు వచ్చాయి. దీన్ని సంపూర్ణం చేసుకోండి. నా ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయి’ అన్నారు. 14 ఏండ్లు కేసీఆర్ ఎన్ని కష్టాలు పడ్డారో, టీఆర్ఎస్ ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నదో చరిత్ర పుటలు తిరగేస్తే తెలుస్తుందని అన్నారు. ఈరోజు ఊరు పేరు లేనివాళ్లు, బాధ్యత లేనివాళ్లు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కేసీఆర్ అనే మూక్షరాల శక్తి లేకపోతే, టీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఈ రోజు రాష్ట్రంలో మాట్లాడుతున్న ఎవరికైనా పదవులు లేవు.. చివరికి నాతో సహా. రాష్ట్రం సాధించిన ఈ 8 ఏండ్లల్లో ఉద్యమం ఆగలేదు. అభివృద్ధి రూపంలో కొనసాగుతున్నది. దేశంలో 75 ఏండ్లల్లో ఏ రాష్ట్రం, ఏ ప్రభుత్వం చేయని అసాధారణమైన అద్భుతాలు కేసీఆర్ ఆవిష్కరించారు. డిస్కవరీ చానల్లో, నేషనల్ జియోగ్రాఫికల్ చానల్లో చైనావాళ్లు త్రిగోర్జెస్ డ్యామ్ కట్టారని చెప్తుంటే చూస్తాం. అదే డిస్కవరీ చానల్లో తెలంగాణలో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కేసీఆర్ కట్టారని చెప్తుంటే ప్రతి తెలంగాణ బిడ్డ గుండె ఆనందంతో ఉప్పొంగింది. ఇవాళ తెలంగాణ దేశానికే దిక్సూచిగా, టార్చ్ బేరర్గా ఎదిగింది.
కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేదని మీరంటున్నారు. అదే సమయంలో తెలంగాణకు టీఆర్ఎస్ ఏమీ చేయలేదని బీజేపీ నేతలంటున్నారు. దీనికి మీ సమాధానం?
అద్దాల మేడలో ఉండేవాళ్లు ఇతరులపై రాళ్లేసే ముందు తామెక్కడున్నామో అని ఆలోచించుకోవాలి. ప్రధాని మోదీ 2022 నాటికి దేశంలోని రైతులందరి ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని 2014లో చెప్పారు. కేంద్రం సాయంతో దేశంలో ఏ రాష్ట్రంలోనైనా రైతుల ఆదాయం రెట్టింపు అయిందేమో చూపిస్తారా? రైతుల పెట్టుబడి, కష్టాలు రెట్టింపు అయ్యాయి. ప్రతి పేదవాడికి ఇండ్లు ఇస్తానన్నారు.. కట్టించారా? విదేశాల్లోని మన దేశీయుల నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్నారు.. వేశారా? ఏటా 2 కోట్ల కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పింది మోదీయా? కేసీఆరా?
దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక ప్రాజెక్టులు పూర్తిచేశామని మీరు చెప్తున్నారు. కానీ అవే ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని, సీబీఐ విచారణ జరిపిస్తామని విపక్షాలు అంటున్నాయి. దీనిపై మీరేమంటారు?
నోరుంది కదా అని ఏమైనా మాట్లాడొచ్చు. నేను కూడా బండి సంజయ్ సీరియల్ కిల్లర్, విజయ్మాల్యా కంటే రేవంత్రెడ్డి పెద్ద కుంభకోణాలు చేసిండు అని, ప్రధాని రాఫెల్ కుంభకోణంలో రూ.లక్ష కోట్లు సంపాదించారని, అదానీ వెనుక మోదీ ఉన్నారని నిరాధారమైన ఆరోపణలు చేయొచ్చు. అంత మాత్రాన అది నిజమా? నా దగ్గర ఆధారం ఉన్నదా? ఆధారాలుంటే ప్రజల ముందు పెట్టండి. ప్రజాకోర్టులో ప్రజలు, న్యాయ వ్యవస్థ లేదా ఇతర వ్యవస్థలు తేలుస్తాయి. ఈడీ, సీబీఐ, ఐటీ అంటారా? దేశంలో 20-21 బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు జరిగాయా? బీజేపీయేతర రాష్ర్టాల్లోనే ఎందుకు విరుచుకుపడతాయి? బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉన్నవాళ్లే సత్యసంధులా? ప్రత్యర్థి పార్టీల్లోనివారే అక్రమాలు చేస్తున్నారా? సుజనా చౌదరి, సీఎం రమేశ్ టీడీపీలో ఉన్నప్పుడు ఈడీ, సీబీఐ కేసులు పెట్టారు. వాళ్లు బీజేపీలో చేరగానే ఆ కేసులేమయ్యాయి? తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చిన నాయకుడిని, రెండుసార్లు ప్రజలచేత అద్భుతమైన మెజారిటీతో ఎన్నుకోబడ్డ నేతను, 68-69 ఏండ్లున్న కేసీఆర్ను తెల్లారి లేస్తే ‘జైల్లో పెడతాం’ అని నోటికొచ్చినట్టు దూషించటాన్ని ప్రజలు గమనించాలి.
కేంద్రం సాయంతో దేశంలో ఏ రాష్ట్రంలోనైనా రైతుల ఆదాయం రెట్టింపు అయిందేమో చూపిస్తారా? రైతుల పెట్టుబడి, కష్టాలు రెట్టింపు అయ్యాయి. ప్రతి పేదవాడికి ఇండ్లు ఇస్తానన్నారు.. కట్టించారా?
ప్రభుత్వం తనను అవమానిస్తున్నదని గవర్నర్ అంటున్నారు. ఉన్నట్టుండి ఇప్పుడెందుకు ఈ సమస్య వచ్చింది?
ప్రధాని మోదీ ఆశీర్వాదంతో తెలంగాణలో జిల్లాకో మెడికల్ కాలేజీ అని గవర్నర్ ట్వీట్టర్లో సందేశం పెట్టారు. గవర్నర్కు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న. తెలంగాణ ప్రజలకు అసత్యాలు చెప్పవద్దు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి జాగ్రత్తగా మాట్లాడాలి. రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో ఒక్క పైసా అయినా కేంద్రానిది ఉన్నదా? సామాన్య కార్యకర్తలు అసత్య ప్రచారాలు చేస్తే అర్థం చేసుకోవచ్చు. రాజ్యాంగ పదవిలో ఉన్నవాళ్లు ఇట్లా మాట్లాడితే ఎలా అర్ధం చేసుకోవాలి? గవర్నర్ ఇలా వ్యవహరించటం ఇది మొదటిసారి కాదు. బీజేపీ కార్యకర్తలా మాట్లాడితే ఎలా? ‘నేను15 రోజులపాటు ఒక ఫైల్ను తొక్కిపెడితే ఈ గవర్నమెంట్ కూలిపోయేది’ అని గవర్నర్ అనొచ్చా? 105 మంది ఎమ్మెల్యేలున్న ప్రభుత్వం గవర్నర్ అనుకుంటే పడిపోతుందా? నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ‘రాజకీయేతర వ్యక్తులనే గవర్నర్లుగా నియమించాలి. రాజకీయాలతో సంబంధం ఉన్నవారిని గవర్నర్లుగా పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు’ అని గంభీరమైన ప్రసంగాలు చేశారు. ఇప్పుడు అవన్నీ ఏమయ్యాయి?
మా ఒత్తిడి వల్లే రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొంటున్నదని బీజేపీ, కాంగ్రెస్ అంటున్నాయి. దీనికి మీరేమంటారు?
చంపినవాడే సంతాపం తెలిపితే ఎట్లా ఉంటదో ఇది అట్లనే ఉన్నది. పోయిన యాసంగి సమయంలో పంట కోతకొచ్చినపుడు మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లాం. పీయూష్ గోయల్ను కలిస్తే ‘మా దగ్గర నాలుగేండ్లకు సరిపడా నిల్వలున్నాయి. ఎగుమతి చేయటానికి కూడా అవకాశాల్లేవు. ఈసారి కొనం’ అని చెప్పారు. ఇదే విషయాన్ని మేం రైతులకు చెప్పాం. కరోనా సమయంలోనూ రైతులను ఆదుకొన్నాం.. ఇప్పుడు కొనలేమా? కానీ కేంద్రం వడ్లు కొనను అంటున్నది. వరి వేసి ఆగం కావద్దని రైతులకు మేం చెబితే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ధాన్యం కొనుగోలుతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు. కొనేది కేంద్రం.. కొనిపిచ్చేది నేను.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్తున్నా అని ప్రకటించారు. ‘ఉప్పుడు బియ్యమైనా, ముడిబియ్యమైనా మేమే కొంటాం.. నా బాధ్యత అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి చెప్పిండు. కరెంటు, నీళ్లు ఎందుకిచ్చారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రశ్నిస్తున్నారు. కేంద్రప్రభుత్వ సలహా మేరకు వరిసాగు తగ్గిద్దామంటే వీళ్ల గందరోళంతో 30-36 లక్షల ఎకరాల్లో రైతులు వరి వేశారు. అప్పుడు మళ్లీ ఢిల్లీకి వెళ్లి.. ‘మేం వరిసాగు తగ్గించే ప్రయత్నం చేస్తుంటే మీ నాయకులే రైతులను గందరగోళానికి గురిచేశారు. ఇప్పుడు ఏం చేయాలని అడితే.. ‘మీ ప్రజలకు నూకలు తినమని చెప్పండి’ అని అంటారా? అందుకే గల్లీ నుంచి ఢిల్లీ దాకా లొల్లిపెట్టి కేంద్రం దుర్నీతిని ఎండగట్టినం. నరేంద్రమోదీ రైతు విరోధి అని దేశ రైతాంగానికి చెప్పగలిగాం.
ప్రజలపై పెట్రోల్, డీజిల్ ధరల భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పన్నులను తగ్గించాలని బీజేపీ చెప్తున్నది. దీనిపై ఏమంటారు?
పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరగటానికి ఖచ్చితంగా ప్రధానమంత్రి వైఫల్యమే. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ధరలు పెరిగితే చేతకాని కేంద్ర ప్రభుత్వం అధికారం నుంచి తప్పుకోవాలని నాడు సీఎంగా ఉన్న నరేంద్రమోదీ మాట్లాడిండు. ఆడబిడ్డలు సిలిండర్కు దండం పెట్టుకొని పోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించండి అని పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో క్రూడాయిల్ బ్యారెల్ ధర 105 డాలర్లు. ఆ రోజు లీటరు పెట్రోల్ ధర రూ.75. ఇప్పుడు క్రూడాయిల్ బ్యారెల్ ధర అంతే ఉన్నది. లీటర్ పెట్రోల్ ధర మాత్రం రూ.120 అయ్యింది. ఇది తెలంగాణ ప్రభుత్వం పెంచిందా? రాష్ట్రం ప్రభుత్వం వ్యాట్ను కొంచెం కూడా పెంచలేదు. మరి పెట్రోల్ ధర 120 ఎట్లా అయింది? బీజేపీ సర్కారుకు ప్రజలపై ప్రేమ ఉంటే సెస్లు మొత్తం ఎత్తివేయాలి.
ఇటీవల ఖమ్మం, రామాయంపేటలో జరిగిన సంఘటలను ఏ విధంగా చూస్తారు?
రామాయంపేటలో తల్లి, కొడుకు ఆత్మహత్య చేసుకొన్నారంటే మనసున్న ఎవరికైనా బాధ కలిగింది. నాకూ బాధ కలిగింది. వెంటనే మా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి ఫోన్ చేసి ఏం జరిగిందో తెలుసుకొన్నాం. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మున్సిపల్ చైర్మన్, ఇతరులు జ్యూడిషియల్ రిమాండ్కు పోయా రు. ఎక్కడ ఇలాంటి ఘటనలు జరిగినా, నేరస్తులను వదిలిపెట్టేది లేదు. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో కేంద్ర మంత్రి కుమారుడు వాహనంతో తొక్కించి 8 మంది రైతులను చంపారు. దీనిపై ప్రధానమంత్రి ఆ మంత్రిని పదవి నుంచి తప్పించారా? మా పార్టీ నేతలు ఎవరు తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకొంటున్నాం. మాకు రాష్ట్రం ముఖ్యం.. వ్యక్తులు కాదు.
కొన్ని జిల్లాల్లో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి. ఆధిపత్య పోరు వార్తలు వింటున్నాం?
స్థానిక సంస్థల నుంచి శాసనసభ వరకు చూస్తే టీఆర్ఎస్ బలమైన శక్తిగా ఆవిర్భవించింది. ఈ పార్టీలో ఉంటే.. ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని ఎంతోమంది గులాబీ కండువా కప్పుకొన్నారు. పదవులుంటే ఆశించేవారు అధికంగా ఉండటం సహజమే. దీనివల్ల స్పర్థ వస్తుంది. హద్దులు దాటితే చర్యలు తీసుకొంటాం. టీఆర్ఎస్ అంటే పడని మీడియా చిన్న వాటిని చిలువలు పలువలు చేసి ప్రచారం చేస్తున్నది. ఈ మధ్య డిజిటల్ మీడియాలో కేసీఆర్ను తిట్టుడు తప్ప ఇంకో పనిలేదు. కేసీఆర్ కాలి గోటికి సరిపోని కొందరు జర్నలిస్టు ముసుగులో చిల్లర దందాలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు.
బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిందనే ప్రచారం జరుగుతున్నది? ఇందులో వాస్తవం ఉన్నదా?
ఒక పార్టీ, ఒక వ్యక్తి తనవైపు ఇతరులను ఆకర్షించాలంటే ఆయస్కాంత శక్తి ఉండాలి. తమ కోసం ఏదైనా చేస్తామనే విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించాలి. టీఆర్ఎస్ ఎనిమిదేండ్ల పాలనలో ఏం చేసిందో 15 నిమిషాలపాటు వరుసగా చెప్తా? కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏం మంచి చేసిందో బీజేపీ నేతలు చెప్తారా? తెలంగాణ అంటే ప్రధానికి ఎందుకింత ఈర్ష్య? కేసీఆర్, టీఆర్ఎస్ అంటే ఎందుకంత దుగ్ద? నా రాష్ట్రం పుట్టుకనే సవాల్ చేసిన మోదీకి ఇక్కడ నూకలు చెల్లాలా? నా ప్రజలను నూకలు తినండి అన్న వారికి తోకలు కట్ చేయొద్దా?
టీఆర్ఎస్ ఎనిమిదేండ్ల పాలనలో ఏం చేసిందో 15 నిమిషాలపాటు వరుసగా చెప్తా? కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏం మంచి చేసిందో బీజేపీ నేతలు చెప్తారా? తెలంగాణ అంటే ప్రధానికి ఎందుకింత ఈర్ష్య? కేసీఆర్, టీఆర్ఎస్ అంటే ఎందుకంత దుగ్ద? నా రాష్ట్రం పుట్టుకనే సవాల్ చేసిన మోదీకి ఇక్కడ నూకలు చెల్లాలా? నా ప్రజలను నూకలు తినండి అన్న వారికి తోకలు కట్ చేయొద్దా?
రాష్ట్రంలో ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నా.. అప్పుడే ఎన్నికల వాతావరణం కనపడుతున్నది. ముందుస్తుకు వెళ్తారా?
2023లో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని సీఎం కేసీఆర్ ఇప్పటికే చెప్పారు. కేసీఆర్ చెప్పిందే ఫైనల్. ఎలాంటి ఉహాగానాలను పట్టించుకోవాల్సిన పనిలేదు. తెలంగాణతో సంబంధంలేని వారు కూడా ఇక్కడ పార్టీలు పెడుతున్నారు. షర్మిలకు తెలంగాణతో ఏం సంబంధం? అసలు ఆమె ఎవరు? తెలంగాణకు చేసిందేమిటి? ఇక్కడ పార్టీ పెట్టడానికి ఆమెకు ఉన్న అర్హత ఏంది? తెలంగాణ సమాజం ఇంకా కూడా వలసవాద పెత్త్తనాన్ని కోరుకొంటున్నదా? ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కారంచేడు, దళితుల మీద దాడులు జరిగినప్పుడు, చుండూరులో దాడులు జరిగినప్పుడు ఎక్కడున్నారో తెలియదు. ఆయన వచ్చి దళితులను ఉద్ధరిస్తామని, దళితబంధు పెట్టిన సీఎం కేసీఆర్ను విమర్శిస్తడు. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర నాయకుల పక్కన నిలబడి ఓయూ, కాకతీయ వర్సిటీల్లో ఉద్యమాన్ని తొక్కి పారెయ్యాలన్న వ్యక్తి వచ్చి తెలంగాణలో ఏదో జరిగిపోతున్నదని అంటడు. వీళ్లంతా బీజేపీ లాంటి పార్టీలకు పరోక్షంగా మద్దతివ్వడానికి వచ్చే శిఖండి పాత్రలు. యూపీలో బీఎస్పీ నేత మాయావతి ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి సహకరించారు. ఇక్కడ పోటీచేసి బీజేపీకి సహకరించాలనుకొంటున్నారు.
ఇటీవల కాలంలో టీఆర్ఎస్ మళ్లీ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టినట్టుంది. నేషనల్ లెవల్లో అలాంటి పొలిటికల్ వాక్యూమ్ ఉన్నదా?
డెఫినెట్గా ఉన్నది. కాంగ్రెస్ బలహీనత, దద్దమ్మతనమే బీజేపీకి బలం. అట్లాంటప్పుడు కచ్చితంగా దేశం మొత్తం ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నది. గత 75 ఏండ్లలో రెండు పార్టీలకు ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు. 50 ఏండ్లు ఒకపార్టీకి, 17 ఏండ్లు ఇంకోపార్టీకి. ఇద్దరూ ఫెయిల్ అయ్యిండ్రు. కాబట్టి దేశ ప్రజలు ఒక విశ్వసనీయ ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నరు. అది ఏరూపంలో వస్తది? ఎట్లా వస్తది? ఎప్పుడు వస్తది? కేసీఆర్ ప్రయత్నాలు ఫలిస్తాయా? అనేదానికి కాలమే సమాధానం చెప్తుంది. సీఎం కేసీఆర్ ఉక్కు సంకల్పం గలవారు. జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తారని నేను నమ్ముతున్నా.
2014కు ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ, గుజరాత్ మోడల్ అన్నారు. ఇప్పుడు మీరు తెలంగాణ మోడల్ అంటున్నారు? 2014కు పూర్వం గుజరాత్ సీఎంగా మోదీ చెప్పింది ఏంది? గుజరాత్గా వికాస్గా నమూనా.. గుజరాత్ మాదిరిగానే దేశం మొత్తాన్ని చేస్తా అని చాలా చక్కటి మాటలు చెప్పిండ్రు. ఏ ఒక్క విషయమైనా సక్సెస్ఫుల్గా చేసిండ్రా? అందుకే అంటున్నా.. అది గోల్మాల్ గుజరాత్ మోడల్. మనది గోల్డెన్ తెలంగాణ మోడల్. రెండింటికీ తేడా ఏందంటే.. ఇక్కడ ఇంటింటికి నీళ్లు ఇసామన్నం.. ఇచ్చినం. ఇక్కడ కోటి ఎకరాల మాగాణం చేస్తమన్నం.. చేశాం. ఇదే తెలంగాణ మోడల్ను దేశంమందు పెడతాం.
ఇటీవల కాలంలో ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో మత సంఘర్షణలు చూస్తున్నాం. రానున్న రోజుల్లో తెలంగాణలో అలాంటి పరిస్థితి వస్తే?
ప్రభుత్వ నిర్వహణలో వైఫల్యం చెందినప్పుడు, ప్రభుత్వ అధినేతలు అసమర్థులైనప్పుడు ఇట్లాంటి అంశాలు తెరమీదకు వస్తాయి. ఎందుకంటే ఇది డైవర్షనరీ టాక్టిక్. ప్రజల దృష్టి మళ్లించాలి.. భావోద్వేగాలు రెచ్చగొట్టాలి.. పనికిమాలిన విషయాలు తీసుకొచ్చి అసలు విషయాల గురించి చర్చ చేయకుండా చేయాలి. మోదీ నిర్వాకం వల్ల 30 ఏండ్లలో లేనంత ద్రవ్యోల్బనం ఈ రోజు దేశంలో ఉన్నది. జాబ్లు లేవు.. నిరుద్యోగం ఉన్నదని మేం అంటే..హిజాబ్ గురించి మాట్లాడదాం అని వాళ్లు అంటున్నరు. జాబా? హిజాబా? ఈ దేశం ఆలోచించుకోవాలి. దేశంలో ఒకవైపు నీళ్లులేక, కరెంటు లేక, ఉద్యోగాలు లేక, ఎకానమీ పడిపోయిన కునారిల్లిపోతుంటే వీళ్లు హలాల్, హిజాబ్, పాకిస్థాన్, అప్ఘనిస్థాన్, చైనా అంటున్నారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్ల తర్వాత కూడా మతంపేరిట పంచాయతీలు, కులం పేరుమీద పంచాయతీలు పెడుతున్నారు. అందుకే ఈ దేశ యువతను, ముఖ్యంగా తెలంగాణ యువతను ఒక్కటే ఆలోచించమని అడుతున్నా. యాపిల్ కంపెనీ విలువ మూడు ట్రిలియన్ డాలర్లు ఉంటే, 130 కోట్ల మంది ఉన్న మన దేశ ఎకానమీ సైజు 2.8 ట్రిలియన్ డాలర్లు. అంటే సిగ్గుపడదామా? గర్వపడదామా? దేశంలోని సామాన్యుడికి కావాల్సినది ఉండటానికి ఇల్లు, పిల్లలకు మంచి చదువు, అందరికీ మంచి వైద్యం, సోషల్ సెక్యురిటీ. ‘హనుమాన్ చాలీసా చదువుదాం అంటున్నరు..చదువురా.. బై ఎవరు వదన్నరు? ఎవరింట్లో వాళ్లకు పూజా మందిరం ఉంటది. చదువుతరు. కానీ, ఎవరింట్లో ఏం పూజ చేస్తరు? ఎవరింట్లో ఏం బట్టలు వేసుకుంటరు? ఏం తింటారు?.. ఇదా ప్రభుత్వాలు చేయాల్సిన చర్చ? ఏం జరుగుతున్నది. ఈ దేశంలో?
ప్రశాంత్కిషోర్తో టీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకొన్నదా?
ప్రశాంత్ కిషోర్తో మా పరిచయం ఇనాటిది కాదు. గత ఏడేండ్లల్లో చాలాసార్లు కలిశాం. పీకే ఐ ప్యాక్ లాంటి సంస్థలు ఎన్నో వచ్చాయి. ఏ రాజకీయ పార్టీ ఐనా ప్రజల్లో ఆదరణ లేకుంటే ఏ ప్రశాంత్ కిషోర్, వ్యూహకర్తలు కాపాడలేరు. మారుతున్న కాలానికి అనుగుణంగా, కొత్త తరానికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకోవడం, లక్ష్యాలు చేరేలా చూసుకోవడం పార్టీల బాధ్యత. ఇలాంటి సందర్భాల్లో ప్రశాంత్కిషోర్ లాంటి వాళ్లు పనికొస్తారు. పీకే ఏర్పాటుచేసిన సంస్థ ఐప్యాక్తో టీఆర్ఎస్ కలిసి పనిచేస్తుంది. పీకేకు ఐప్యాక్తో అధికారికంగా సంబంధంలేదు. కాంగ్రెస్ను పీకే కాదు కదా.. ఎవ్వడూ కాపాడలేడు. అది మునిగిపోయిన నావ. సిక్ అయిపోయిన యూనిట్. కాంగ్రెస్లోకి పోయి ప్రశాంత్ కిషోర్ వ్యక్తిగతంగా నష్టపోతానంటే ఆయన ఇష్టం. మాకు సంబంధంలేదు.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం చూస్తున్నాం. అలాంటి పరిస్థితులు రాకుండా ఎలాంటి డైనమిక్ గవర్నమెంట్ ఉండాలి?
ఇది చాలా మంచి ప్రశ్న. ఈ మధ్యన కొంతమంది సోకాల్డ్ మేధావులు శ్రీలంక పరిస్థితి మనకూ వస్తది.. మన దేశం మునిగిపోతది.. మన రాష్ట్రం మునిగిపోతది.. అని మాట్లాడుతున్నరు. ఫ్రీబీ కల్చర్ ఎక్కువైందని అంటున్నరు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్ల తర్వాత కూడా మన దేశంలో తలసరి ఆదాయం దాదాపు 2 వేల డాలర్లు మాత్రమే. అమెరికాలో తలసరి ఆదాయం 60 వేల డాలర్లు. ఒక ముసలి అవ్వ తన పిల్లలపై ఆధారపడకుండా మందు గోళీలు.. తనకు కావాల్సిన చిన్నచిన్న అవసరాలు తీర్చుకొనేందుకు రూ.2 వేలు పెన్షన్ ఇస్తే తప్పా? ఓ దివ్యాంగుడికి ఆసరా రూపంలో రూ.3 వేలు ఇస్తే తప్పా? రైతులకు పెట్టుబడి సాయం చేస్తే తప్పా? ఈ దేశంలో పేదలు లేరన్నట్టు.. మనమేదో బల్మీటికి పంచిపెడుతున్నట్టు చెప్పడం తప్పు. ఈ దేశంలో పేదరికాన్ని తొలగించాలి. తెలంగాణ తలసరి ఆదాయం 2014లో రూ. రూ.1, 24,000. ఈరోజు రూ.2,78,000. దేశంలో రెండున్నర శాతం జనాభా ఉన్న తెలంగాణ, ఇతర రాష్ర్టాలకు బువ్వ పెడుతున్నది. మనది ఎదుగుతున్న ఎకానమీ. ఇది మరింత పెరిగేలా, పరుగులు పెట్టించాలంటే మతం, కులం పేరిట పనికిమాలిన పంచాయతీలు ఉండకూడదు. ప్రతి పైసా మరో పైసాను సృష్టిస్తుంది.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే.. మీరు రాష్ట్ర పగ్గాలు చేపడతారన్న ప్రచారం జరుగుతున్నది. వాస్తవమేనా?
అందులో ఏమాత్రం వాస్తవం లేదు. మా నాయకుడు రాజకీయంగా ఇంకా చాలా సంవత్సరాలపాటు తన సామర్థ్యంతో రాష్ర్టానికి, దేశానికి సేవలందించే ప్రయత్నంలో ఉన్నారు. తప్పకుండా వారి నాయకత్వంలో మంత్రిగా పనిచేసే అవకాశం రావడమే అదృష్టం. అంతకుమించి కోరుకోవడం దురాశ అవుతుంది. నాకు అట్లాంటి దురాశ లేదు.
టీఆర్ఎస్ ప్లీనరీ ద్వారా రాష్ర్టానికి, దేశానికి ఏం చెప్పదల్చుకున్నారు?
మేం చెప్పదల్చుకుంది ఒకే అంశం. తెలంగాణకు ఏదైనా బాధ కల్గితే అందరికంటే ఎక్కువ బాధపడేది టీఆర్ఎస్, కేసీఆర్. తెలంగాణకు ఏదైనా లాభం జరిగినా.. ప్రయోజనం కల్గినా అందరికంటే ఎక్కువ సంతోషపడేది టీఆర్ఎస్, కేసీఆర్. మీ బిడ్డ కేసీఆర్. ఈ రాష్ర్టాన్ని తెచ్చిన నాయకుడు. అట్లాంటి నాయకుడు అవసరమైతే తెలంగాణ ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం భగవంతుడితోనైనా కొట్లాడే ఉక్కు సంకల్పం.. ధీరోదాత్తత కలిగిన నాయకుడు. అట్లాంటి నాయకుడిని, అట్లాంటి పార్టీని కాపాడుకుంటేనే ఈ ప్రాంత ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు లాభం. ఈ విషయం గుర్తెరగాలి. తెలంగాణ సమాజం అంతా ఒక్కటై ఈ గుజరాతీ గులామ్లకు, ఢిల్లీ గులామ్లకు బుద్ధి చెప్పాల్సిన సందర్భం భవిష్యత్తులో వస్తుంది. అప్పుడు తిరుగులేని పద్ధతుల్లో మరోసారి తెలంగాణ తెగువను చూపెట్టాలన్నదే మా విజ్ఞప్తి.
ఎక్కడ ఇలాంటి ఘటనలు జరిగినా, నేరస్తులను వదిలిపెట్టేది లేదు. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో కేంద్ర మంత్రి కుమారుడు వాహనంతో తొక్కించి 8 మంది రైతులను చంపారు. దీనిపై ప్రధానమంత్రి ఆ మంత్రిని పదవి నుంచి తప్పించారా? మా పార్టీ నేతలు ఎవరు తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకొంటున్నాం.
జీవో 111 రద్దుపై కొందరు లేవనెత్తుతున్న ప్రశ్నలకు మీ సమాధానం?
ప్రతి దాంట్లో రాజకీయమే.. రాద్ధాంతమే చేస్తామంటే ఎట్లా? 2008లోనే వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే జీవో 111 రద్దుకు రంగం సిద్ధం చేశారు. జీవో పరిధిలోని 84 గ్రామాల ప్రజలు 1996 నుంచి జీవో రద్దుకు పోరాడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, అప్పుడున్న టీడీపీ, టీఆర్ఎస్ ఇలా అన్ని పార్టీలు ప్రజలకు జీవో రద్దుపై హామీ ఇచ్చాయి. సీఎం కేసీఆర్ 2014 నుంచి అనేక సందర్భాల్లో అనేక ఎన్నికల సభల్లో జీవో 111 రద్దు చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు మాట నిలుపుకొన్నది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. ఆ పర్యటనను మీరు ఏ విధంగా చూస్తారు?
రాహుల్గాంధీ ఇతర రాష్ర్టాల్లో పర్యటన బంద్చేసి సొంత సీటు అమేథీలో తిరగాలి. అమేథీలో ఎంపీగా ఓడిపోయిండు. అమేథీ పరిధిలోని ఒక్క అసెంబ్లీ స్థానాన్ని గెలిపించలేకపోయిండు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటరు. ముందు నీ సొంత సీట్లో గెలువు. బీజేపీని నిలువరించే సత్తా కేసీఆర్కు ఉన్నది. దేశంలో ఎక్కడైతే ప్రాంతీయ శక్తులు బలంగా ఉన్నాయో అక్కడ బీజేపీ ఎదగలేకపోతున్నది. కాంగ్రెస్ బిగ్గెస్ట్ అసెట్ ఫర్ బీజేపీ. బీజేపీ శక్తి ఏందంటే కాంగ్రెస్, రాహుల్గాంధీ. కాంగ్రెస్ చేతకానితనమే మోదీ బలం. తెలంగాణ అంశాన్ని రాహుల్గాంధీ పార్లమెంట్లో ఒక్కసారైనా ప్రస్తావించారా? తెలంగాణ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుంటే ఆయనకు నోరు పేకలలేదు. తెలంగాణ వడ్లు కొనకపోతే అడగటానికి నోరు రాదు. ఎందుకు రాహూల్ గాంధీకి అంత భయం? ఎప్పటికైనా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడగలిగే ఒకే ఒక్క వ్యక్తి కేసీఆర్. ఒకే ఒక్క పార్టీ టీఆర్ఎస్.