రఘునాథపాలెం, ఫిబ్రవరి 4: వాహన ప్రేమికుల కోసం ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల గ్రౌండ్లో రెండ్రోజులపాటు ‘నమస్తే తెలంగాణ’, తెలంగాణ టుడే’ పత్రికల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో ఎక్స్పో దిగ్విజయంగా ముగిసింది. ఈ ప్రదర్శనకు చివరి రోజైన ఆదివారం సెలవు దినం కావడంతో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన ఎంతో మంది సందర్శకులు ఈ ప్రదర్శనకు పోటెత్తారు. వివిధ ఆటోమొబైల్ కంపెనీల స్టాళ్లను సందర్శించి వాహనాలను టెస్ట్ రైడ్ చేశారు. అక్కడే అందుబాటులో ఉన్న బ్యాంకర్లను సంప్రదించి ఆయా వాహనాల కొనుగోలుకు కల్పిస్తున్న రుణ వసతుల గురించి తెలుసుకున్నారు. అనంతరం పలువురు కొనుగోలుదారులు అక్కడికక్కడే వాహనాలను బుక్ చేసుకున్నారు.
ఆటో ఎక్స్పో ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ.. అనేక దిగ్గజ కంపెనీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి వాహన ప్రేమికులు అబ్బురపడేలా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఒకవైపు తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో ముఖ్య భూమిక పోషిస్తున్న ‘నమస్తే తెలంగాణ’, తెలంగాణ టుడే’ పత్రికలు మరోవైపు ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించడం గొప్ప విషయమని ప్రశంసించారు. అనంతరం బంపర్ డ్రాలో గెలుపొందిన విజేతలకు బహుమతులు, ఈ ప్రదర్శనలో స్టాళ్లు ఏర్పాటు చేసిన వివిధ కంపెనీల ప్రతినిధులు, బ్యాంకర్లకు జ్ఞాపికలు, ప్రత్యేక గిఫ్ట్ హ్యాంపర్లు అందజేశారు. కార్యక్రమంలో ‘నమస్తే తెలంగాణ’ బీఎం రేనా రమేశ్, బ్యూరో ఇన్చార్జి మాటేటి వేణుగోపాల్, యాడ్స్ డిప్యూటీ మేనేజర్ బోయిన శేఖర్బాబు, సర్క్యులేషన్ మేనేజర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.