హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ప్రజా సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారం కోసం నిర్ణయాలు చేసే వేదికగా పార్లమెంట్ సమావేశాలు సాగాలని బీఆర్ఎస్ లోక్సభాపక్షనేత నామా నాగేశ్వర్రావు స్పష్టంచేశారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషి శనివారం ఢిల్లీలోని లైబ్రరీ భవన్లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో నామా పలు అంశాలను లేవనెత్తారు.
ధరల పెరుగుదల, నిరుద్యోగ సమ స్య, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, ప్రజాసమస్యలపై చర్చ జరగాలని కోరారు. పండించిన పంటలపై రైతు కు కనీస మద్దతు ధర విషయంలో తమ పార్టీ మొదటి నుంచి చేస్తున్న డిమాండ్పై కనీసం ఈ సమావేశాల్లోనైనా చర్చించాలని డిమాండ్ చేశారు. కేంద్రం మొదటి నుంచి తమ అనుకూల బిల్లులను ఆమోదించుకొనేందుకు మాత్రమే సమావేశాలు నిర్వహిస్తున్నదని, ప్రజాసమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి మార్గం వేసేందుకు నిర్వహించటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ర్టానికి సంబంధించి పెండింగులో ఉన్న నిధులు విడుదలలో వివక్ష ప్రదర్శిస్తూ కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తున్నదని ఆరోపించారు.