మేడ్చల్, డిసెంబర్ 13 : మేడ్చల్ జిల్లా శామీర్పేటలోని నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రిసెర్చ్(నల్సార్), హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ(ఎస్వీపీఎన్ఏ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. కళాశాల వేదికగా నల్సార్ వైస్ చాన్సలర్ శ్రీకృష్ణ దేవరావు, పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఏఎస్ రాజన్ ఒప్పందం పత్రాలను మార్చుకొన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా రెండు సంస్థలు కలిసి క్రిమినల్ జస్టిస్ మేనేజ్మెంట్లో మాస్టర్ డిగ్రీ, పీజీ డిప్లోమా కోర్సులను నిర్వహించనున్నాయి. కార్యక్రమంలో నల్సార్ రిజిస్ట్రార్ బాలకిష్టా రెడ్డి, ఎస్వీపీఎన్ఏ జేడీ అమిత్ గార్గ్ తదితరులు పాల్గొన్నారు.