నీలగిరి, జూన్ 14: నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్న ముఠాను అరెస్టు చేసి.. వారి నుంచి రూ.1.80 కోట్ల విలువైన నకిలీ పత్తి విత్తనాలు, కారు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు నల్లగొండ జిల్లా ఎస్పీ కే అపూర్వరావు తెలిపారు. బుధవారం నల్లగొండలోని జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మీదుగా నకిలీ పత్తి విత్తనాలు సరఫరా అవుతున్నట్టు పక్కా సమాచారంతో ఫ్లైఓవర్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు.
ఈ క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన కారును ఆపి తనిఖీ చేయగా.. రెండు బస్తాల్లో విడి విత్తనాలు కనిపించాయి. వ్యవసాయ అధికారులు వాటిని పరిశీలించగా నకిలీవని తేలింది. కారులో ప్రయాణిస్తున్న సికింద్రాబాద్కు చెందిన గోరంట్ల నాగార్జున, ఆంధ్రాకు చెందిన గడ్డం రవీంద్రబాబు, మెరిగే వేణును అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ముగ్గురిని రిమాండ్కు తరలించామని, మరో వ్యక్తి నర్సింహ పరారీలో ఉన్నాడని ఎస్పీ చెప్పారు. రైతులను మోసం చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, నకిలీ విత్తనాలు అమ్మినా, సరఫరా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని, పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. నిందితులను పట్టుకున్న నల్లగొండ డీఎస్పీ నరసింహారెడ్డి, చిట్యాల సీఐ శివరాంరెడ్డి, నారట్పల్లి ఎస్సై సైదాబాబు, చిట్యాల ఎస్సై రవి, టాస్ఫోర్స్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.