నల్లగొండ, ఏప్రిల్ 4: నాగార్జునసాగర్ హిల్ కాలనీలో తాగునీటి ట్యాంకులో కోతులు పడి చనిపోయిన ఘటనపై జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై నందికొండ మున్సిపల్ కమిషనర్, నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్కు గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీ పూర్ణచందర్ను విచారణ అధికారిగా నియమించారు. తక్షణమే పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ఈ మేరకు అదనపు కలెక్టర్ గురువారమే నందికొండ హిల్కాలనీని సందర్శించి విచారణ చేపట్టి నివేదికను సమర్పించారు. కోతులు పడి చనిపోయిన వాటర్ ట్యాంకు నుంచి 9 గృహాలకు మాత్రమే తాగునీరు సరఫరా అవుతున్నట్టు గుర్తించామని, ఆ ఇండ్లల్లో 49 మంది ఉన్నారని నివేదికలో పేర్కొన్నారు. హిల్కాలనీలో మొత్తం 3 పెద్ద ట్యాంకులున్నాయని, అందులో 2 ట్యాంకులు హిల్కాలనీకి, మరొకటి పైలాన్ కాలనీకి తాగునీరు అందిస్తున్నాయని తెలిపారు.
కోతులు పడి చనిపోయిన తాగునీటి ట్యాంకు ప్రత్యేకంగా ఉన్నదని విచారణలో తెలిసిందని అదనపు కలెక్టర్ చెప్పారు. సంఘటన జరిగిన వెంటనే నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు సదరు నీటి ట్యాంకు నుంచి నీరు రావడం లేదని గుర్తించారని, ఈ నెల 3న మధ్యాహ్నం 2 గంటలకు ఈ విషయాన్ని గమనించి తక్షణమే నీటి సరఫరా నిలిపివేయడంతోపాటు కోతుల మృతదేహాలను తొలగించారని వెల్లడించారు.
మిషన్ భగీరథ ప్రధాన ఇంట్రా పైపులైన్తో ఉన్న లింకును కూడా తీసివేశారని, ఈ ఘటన వల్ల ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదని, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి హిల్ కాలనీని సందర్శించి ప్రజల ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించారని నివేదికలో పొందుపర్చారు. ఆరోగ్య శాఖ ద్వారా అవసరమైన మందులు కూడా సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు.