కట్టంగూర్(నకిరేకల్) ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తూ వృత్తిదారుల అభివృద్ధికి కృషి చేస్తునట్లు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి సబ్సిడీపై మంజూరైన లక్ష చేప పిల్లలను బుధవారం రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి నకిరేకల్ పెద్ద చెరువులో చెరువులలోకి వదిలారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే సంకల్పంతో హరిత విప్లవం మాదిరిగా నీలి విప్లవానికి నాంది పలికిందన్నారు. మత్స్యకారుల అభి వృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వారి అభ్యున్నతే ధ్యేయంగా పని చేస్తున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వ్యవసాయ రంగానికి బడ్జెట్లో 60శాతం నిధులు కేటాయించిందన్నారు. చేతివృత్తుల పోత్సాహం, పాడిపరిశ్రమ, గొర్రెల పంపిణీ లాంటి కార్యక్రమాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు తోడ్పడుతున్నట్లు తెలిపారు. ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్య్సకార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు.
మిషన్ కాకతీయ ద్వారా చెరువులు మరమ్మతులతో మత్స్యకార్మికులకు ఉపాధి లభించండంతో పాటు చేప పిల్లల ఉత్పత్తిలో రాష్ట్ర ఆదాయం మెరుగుపడుతుందని చెప్పారు. మత్స్య కార్మికులు ప్రమాదవశాత్తు, సహజ మరణానికి ప్రభుత్వం రూ.6లక్షలు చెల్లిస్తుందని తెలిపారు. రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలు మాట్లాడుతూ మత్స్య కార్మికులకు ప్రభుత్వం వందశాతం సబ్సిడీపై చేపపిల్లలను అందజేస్తుందని వాటిని పెంచి ఆర్థికంగా ఎదగాలన్నారు.
మత్స్య కార్మికులకు ప్రభుత్వం అందించే ఉచిత చేపపిల్లల పంపిణీ, వలలు, టూ వీలర్లు, అటోలు, మోబైల్ వాహనాలతో పాటు ఇతర పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీవో జగదీశ్వర్రెడ్డి, జిల్లా మత్స్య శాఖ అధికారి చరితారెడ్డి, మున్సిపల్ కమిషనర్ బాలాజీ, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, జడ్పీటీసీ మాద ధన లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ నడికుడి ఉమారాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ మురారిశెట్టి ఉమారాణి, కౌన్సిలర్లు, టీఆర్ఎ స్ నాయకులు పాల్గొన్నారు.