దస్తురాబాద్: శివరాత్రి పండుగ రోజున పరమ శివుడి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివెళ్తారు. భక్తుల తాకిడికి శివాలయాలన్నీ కిక్కిరిసిపోతాయి. శివనామ స్మరణతో శైవ క్షేత్రాలన్నీ మార్మోగుతాయి. అయితే శివుడికి, నాగుపాముకు మధ్య బలమైన బంధం ఉంది. అందుకే నాగుపాము ఎప్పుడూ శివుడి మెడలోనే ఉంటుంది. అమృతం కోసం క్షీర సాగరాన్ని మదించినప్పుడు ముందుగా హాలాహలం వెలువడిందని, దాన్ని పరమ శివుడు తన కంఠంలో దాచుకున్నాడని, ఆ విషానికి బంధనంగా శివుడి మెడలో నాగేంద్రుడు ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి.
అయితే, ఈ పురాణాల విషయం కాసేపు పక్కనపెడితే.. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని గొడిసేర్యాల శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ గర్భగుడిలో శివరాత్రి రోజున నాగుపాము దర్శనమిచ్చింది. శనివారం (శివరాత్రి నాడు) రాత్రి 9.30 గంటలకు ఆలయ గర్భగుడిలోకి వచ్చిన నాగేంద్రుడు ఆదివారం ఉదయం వరకు ఆ పరిసరాల్లోనే తిరుగుతూ కనిపించాడు. శనివారం ఆలయంలోకి నాగేంద్రుడు ప్రవేశించాడని తెలిసి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.
కాగా, నాగేంద్రుడు గొడిసేర్యాల రాజరాజేశ్వరస్వామి ఆలయంలోకి వచ్చి భక్తులకు దర్శనమివ్వడం ఇదే తొలిసారి కాదని, గత పదకొడేండ్లుగా ఇలా జరుగుతున్నదని ఆలయ అర్చకులు సిడెం లక్ష్మణస్వామి తెలిపారు. ప్రతి ఏటా భారీ సంఖ్యలో భక్తులు శివుడితోపాటే, ప్రత్యక్ష నాగేంద్రుడి దర్శనం చేసుకుంటారని చెప్పారు. ఇలా ఏటా శివరాత్రి రోజున భక్తులకు నాగేంద్రుడు దర్శనమివ్వడం మహా భాగ్యమని ఆయన అన్నారు.