ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 8: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో నాగోబా మహాజాతరకు సర్వం సిద్ధమైంది. ఏటా పుష్యమాసంలో వచ్చే అమావాస్య రోజు అర్ధరాత్రి నాగోబాకు మెస్రం వంశీయులు మహాపూజ నిర్వహించడంతో జాతర ప్రారంభమవుతుంది. నాగోబాకు శుక్రవారం అర్ధరాత్రి మెస్రం వంశీయులు మహాపూజ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. దేవాదాయశాఖతోపాటు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగుకు దాదాపు 220 కిలో మీటర్లు మెస్రం వంశీయులు కాలినడకన వెళ్లారు. గోదావరి వద్ద గల హస్తలమడుగు వద్ద పంచలింగాలకు పూజ చేసి పవిత్ర జలాన్ని తీసుకొచ్చారు. ఈ పవిత్ర జలంతో శుక్రవారం అర్ధరాత్రి నాగోబాకు అభిషేకంతో ప్రారంభమయ్యే మహా జాతర 15వ తేదీ వరకు కొనసాగనున్నది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. విదేశాల నుంచి పర్యాటకులు, సందర్శకులు వచ్చి నాగోబాను దర్శించుకుని పూజలు చేస్తారు. జాతరలో భాగంగా 12న ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు.