MAL Marri Janardhan reddy | హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్/ఆర్కేపురం: తాను ఎన్నో ఏండ్లుగా నిర్వహిస్తున్న వ్యాపారాలకు సంబంధించి సుమారు రూ.200 కోట్లకు పైగా ఆదాయపు పన్ను చెల్లించినట్టు నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తెలిపారు. తమ అకౌంట్స్ అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయని, తమ లెక్కలన్నీ కడిగిన ముత్యంలా ఉంటాయని పేర్కొన్నారు. గతంలో రెండుసార్లు తనకు బెస్ట్ ట్యాక్స్పేయర్గా ఆదాయపు పన్నుశాఖ నుంచి అవార్డు వచ్చిందని, ఈ దాడుల తర్వాత కూడా మరోసారి అవార్డు ఇచ్చి వెళ్తారన్న ధీమా వ్యక్తంచేశారు. జూబ్లీహిల్స్లోని మర్రి నివాసంలో బుధవారం ప్రారంభమైన ఐటీశాఖ దాడులు గురువారం కూడా కొనసాగాయి. ఈ నేపథ్యంలో మర్రి జనార్దన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ అధికారులు కక్షపూరితంగా ఎన్ని రోజులు సోదాలు జరిపినా అభ్యంతరం లేదని చెప్పారు.
ఐటీ అధికారులు తమ ఓపికను పరీక్షిస్తున్నారని అసహనం వ్యక్తంచేశారు. తమ పట్ల అసభ్య పదజాలం ఉపయోగిస్తూ, తమ ఉద్యోగులను కొడుతూ, అనధికారికంగా మ్యాన్హ్యాండ్లింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఇది సరైన పద్ధతి కాదని, వారికి చేయి చేసుకునే హక్కు లేదని పేర్కొన్నారు. బిజినెస్పరంగా ఏమైనా అవకతవకలు ఉంటే చెక్ చేసుకోవాలని, తప్పుంటే డబ్బులు కట్టించుకోవాలని చెప్పారు. ఐటీ సోదాల గురించి తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున మర్రి నివాసం వద్దకు చేరుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకుని కార్యకర్తలను సముదాయించారు. ఈ ఆందోళనలో నాగర్కర్నూల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హనుమంతరావు, తాండూరు సింగల్ విండో చైర్మన్ సమద్, బీఆర్ఎస్ నేతలు రమేశ్, ఈశ్వర్రెడ్డి, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
ఆర్కేపురం గ్రీన్హిల్స్ కాలనీలోని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి నివాసంలో రెండవ రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగాయి. దీంతో భువనగిరికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అక్కడకు చేరుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మధ్యాహ్నం సమయంలో ఎమ్మెల్యే శేఖర్రెడ్డి అపార్ట్మెంట్ బాల్కనిలోకి వచ్చి పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. అంతా బాగానే ఉన్నదని, ఎవ్వరూ ఆందోళన చేయవద్దని సూచించారు.
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ఇండ్లు, కంపెనీల్లో ఇన్కంటాక్స్ అధికారుల సోదాలు రెండోరోజు (గురువారం)తో ముగిశాయి. ఈ మేరకు ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చి వెళ్లారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఐటీ అధికారుల తీరు ఉన్నదని ప్రభాకర్రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే దర్యాప్తు సంస్థలతో బీజేపీ దాడులు చేయిస్తున్నదని, కేంద్రం కపట నాటకాలు ప్రజలకు తెలుసునని పేర్కొన్నారు. బీజేపీ నేతలకు కర్రు కాల్చివాత పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ అన్నారు. వారి మాట వినని, బీజేపీ పార్టీలోకి వెళ్లని నేతలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు.