నాగర్ కర్నూల్ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్, మహబూబ్నగర్ ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి ఘన స్వాగతం పలికారు. సీజేఐతో పాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీశ్ చంద్ర శర్మ కుటుంబ సమేతంగా ఆదివారం శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళుతూ మార్గమధ్యలో నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూర్ హరితలో కాసేపు విడిది చేశారు.
ఈ సందర్భంగా మహబూబ్నగర్ ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి, కలెక్టర్ ఉదయ్ కుమార్, ఎస్పీ కే మనోహర్ సీజేఐకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీజేఐ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ జ్ఞాపికను కలెక్టర్ సీజేఐకి అందజేశారు. ఆ తర్వాత శ్రీశైలానికి పయనమయ్యారు. మహబూబ్నగర్ జిల్లా, సెషన్స్ జడ్జి రఘురామ్, మహిళా మరియు పోక్సో జడ్జి ఉమాదేవి, నాగర్ కర్నూల్ సీనియర్ సివిల్ జడ్జి శీతల్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వెంకట్రామ్, డీఎస్పీ గిరిబాబు తదితరులున్నారు.