హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ములుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాడ్వాయి జడ్పీటీసీ, ములుగు జిల్లా పరిషత్ చైర్పర్సన్ బడే నాగజ్యోతిని ప్రకటించడంతో ఆదివాసీ గిరిజనంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియాస్ సీతకకు నాగజ్యోతి రూపంలో బీఆర్ఎస్ చెక్ పెట్టడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. నాగజ్యోతి అభ్యర్థిత్వంతో సీతక ఒకసారిగా కంగుతిన్నారని ఆమె అనుచరులు వాపోతున్నారు. బీఆర్ఎస్ నుంచి ఈసారి కూడా బంజారా తెగకు చెందిన మరెవరికో టికెట్ దకుతుందని, మరోసారి ఆదివాసీల మూకుమ్మడి ఓట్లతో గెలువచ్చని ఆశపడ్డ సీతకకు కేసీఆర్ గట్టి షాక్ ఇచ్చారు.
ములుగు వార్లో బడే మలుపు
గోదావరి ప్రాంత ప్రజలకు సురపరిచితులైన బడే నాగేశ్వర్రావు అలియాస్ ప్రభాకరన్న కూతురైన బడే నాగజ్యోతి నాలుగైదేండ్లుగా ములుగు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. దివంగత జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ హఠాన్మరణంతో భవిష్యత్తును అంచనా వేసి ఆ స్థానాన్ని నాగజ్యోతికి సీఎం కేసీఆర్ అప్పగించారు. చైర్పర్సన్ హోదాలో ములుగు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాలని పార్టీ ఆమెను ముందుచూపుతో ఆదేశించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న కొండాయి, మేడారం, రెడ్డిగూడెం, కాల్వపల్లి, కొత్తూరు తదితర మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఆమె విస్తృతంగా పర్యటించి ప్రజలకు చేరువయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీతకను ఢీకొట్టాలంటే ఆదివాసీలనే రంగంలోకి దింపాలని బీఆర్ఎస్ వ్యూహ రచన చేసింది. తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారిణి, మావోయిస్టు కుటుంబ నేపథ్యం ఉన్న నాగజ్యోతి సరైన అభ్యర్థి అవుతుందని కేసీఆర్ నిర్ణయించారు. ఆమెను ప్రగతిభవన్కు పిలిపించుకొని దిశానిర్దేశం చేశారు.
పటిష్టమైన ఆదివాసీ కట్టుబాటు
ఆదివాసీల్లో స్వాభిమానం, కట్టుబాటు, ఒకేమాటకు కట్టుబడే నైజం వంటి అనేక అంశాలు నాగజ్యోతికి అనుకూలంగా మారే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ములుగు ఎన్నికల్లో లంబాడా తెగకు చెందిన అజ్మీరా చందూలాల్, ఆదివాసీలైన చెందిన చర్ప భోజారావు, పొదెం వీరయ్య, ధనసరి అనసూయల మధ్యనే పోటీ ఉండేది. స్థానికులైన చర్ప భోజారావు, పొదెం వీరయ్యను ఆదివాసీలు ఒకతాటిపై ఉండి గెలిపించారు. ఆ తర్వాత రెండుసార్లు చందూలాల్ గెలిచారు. అనంతరం కోయ గిరిజన తెగకు చెందిన జనశక్తి గ్రూప్ మాజీ నక్సలైట్ ధనసరి అనసూయ అలియాస్ సీతక పోటీ చేయడంతో ఆమె ఆదివాసీ అనే భావంతో సీతకను ఆదివాసీలు ఒకమాటపై ఉండి గెలిపించారు. కానీ, నేడు ములుగు నియోజకవర్గంలోని ఆదివాసీలను కాదని ఆమె ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన గొత్తికోయలకు మద్దతుగా నిలుస్తున్నారు. దీనిని స్థానిక ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
సీతక్క చేసిందేమిటి?
ఆదివాసీ మహిళా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కోయ గిరిజనల ఆరాధ్య దైవాలైన మేడారం సమ్మక సారలమ్మ జాతరకు జాతీయ గుర్తింపు తేవడం కోసం, గిరిజన యూనివర్సిటీ సాధనకోసం మాట వరుసకైనా సీతక్క నోరెత్తలేదని ములుగు ఆదివాసీలు గుర్రుగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో సఖ్యతలేని కారణంగా ఇతర నియోజకవర్గాలను పోల్చి చూస్తే ములుగు నియోజకవర్గాన్ని ఆమె అభివృద్ధి చేయలేదనే వాదన బలంగా వినిపిస్తున్నది. గత కొంతకాలంగా స్థానిక ఆధికారులను అవమానించే రీతిలో ఆమె మాట్లాడటం కూడా నియోజకవర్గంలో దుమారం రేపుతున్నది. ఓటుకు నోటు కేసు పాత్రదారుడు రేవంత్రెడ్డికి ప్రధాన అనుచరురాలిగా ఉండటంతో నీతి నిజాయితీలకు ప్రాధాన్యమిచ్చే ఆదివాసీల్లో ఆమెపై వ్యతిరేకత నెలకొన్నదని విశ్లేషకులు చెప్తున్నారు. ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి హఠాత్మరణంతో జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచినా ఆమె తన వ్యక్తిగత ఇమేజ్ కోసమే ప్రయత్నిస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏమాత్రం కృషి చేయలేదని కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు మథనపడుతున్నారు. ఈ నేపథ్యంలో ములుగు బీఆర్ఎస్ అభ్యర్థిగా బడే నాగజ్యోతిని ఖరారు చేయటంతో ఈ సారి కచ్చితంగా బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేస్తుందని పార్టీ శ్రేణులు స్పష్టంచేస్తున్నాయి. పోడు భూములకు పట్టాల పంపిణీ కూడా బీఆర్ఎస్కు కలిసి వస్తుందని చెప్తున్నారు.
సీఎం కేసీఆర్కు ములుగు కానుక
2018 ఎన్నికల సందర్భంగా ములుగులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ‘ములుగు జిల్లా కోసం మీరు ఉద్యమిస్తున్నారు. మీ కోరికను తీర్చే బాధ్యత నాది. మీరు చందూలాల్ను భారీ మెజారిటీతో గెలిపించండి. ములుగు జిల్లా చేసే బాధ్యత నాది’ అని సభలో ప్రకటించారు. ఆ ఎన్నికల్లో చందూలాల్ ఓడిపోయారు. అభ్యర్థిని ఓడించిన ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ అనుకోలేదు. అభ్యర్థి గెలిచినా.. ఓడినా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారు. ములుగు జిల్లాను ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి ములుగు ప్రజల్లో అంతర్మథనం నెలకొన్నది. ఈసారి ఎలాగైనా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలనే పట్టుదల ములుగు ప్రజల్లో వ్యక్తమవుతున్నది.
బడే నాగజ్యోతికి సానుకూల అంశాలు