హైదరాబాద్, జనవరి 21(నమస్తే తెలంగాణ)/మాదాపూర్: హైదరాబాద్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్)కు జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మక అసోచాం అవార్డు లభించింది. శిక్షణ, ఉపాధి కల్పన రంగాల్లో నంబర్వన్గా నిలిచినందుకు అవార్డును అందజేస్తున్నట్టు ఆసోచాం (అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా) తెలిపింది. శుక్రవారం వర్చువల్గా నిర్వహించిన సదస్సులో జార్ఖండ్ గవర్నర్ రమేశ్ బేయిస్, ఆ రాష్ట్ర స్పీకర్ రవీంద్రనాథ్ మహతో సమక్షంలో అవార్డును అందజేశారు. కరోనా కాలంలోనూ 9,466 మందికి శిక్షణ ఇచ్చి 8,973 మందికి (84%) ప్లేస్మెంట్స్ ఇవ్వటం అసాధారణ అంశమని అసోచాం ప్రశంసించింది. గత మూడేండ్లలో 41,200 శిక్షణ తరగతులు నిర్వహించినట్టు న్యాక్ డైరెక్టర్ కే భిక్షపతి పేర్కొన్నారు. అవార్డు రావడం పట్ల న్యాక్ వైస్ చైర్మన్, రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు.