హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): రోగులకు రూపాయి కూడా భారం పడకుండా అన్ని ప్రాథమిక, కమ్యూనిటీ, ఏరియా దవాఖానల్లో నిర్వహిస్తున్న వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎంతో ఆర్థిక ఊరటనిస్తున్నాయి. ప్రైవేటు కేంద్రాల్లో వేలు ఖర్చయ్యే పరీక్షలన్నీ ఇక్కడి తెలంగాణ డయాగ్నస్టిక్స్ కేంద్రాల్లో ఉచితంగా చేస్తుండటంతోపాటు ఫలితాలను శరవేగంగా అందజేస్తున్నారు. నిర్ధారణ పరీక్షల నిర్వహణ, ఫలితాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నందుకు తెలంగాణ డయాగ్నస్టిక్స్కు కేంద్రం ‘నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబరేషన్ లాబొరేటరీస్’ (ఎన్ఏబీఎల్) సర్టిఫికేషన్ ఇచ్చింది. నిరుపేద రోగులకు కార్పొరేట్స్థాయి వైద్యమందించడంతోపాటు టెస్టులన్నీ ఉచితంగా చేసి ఆరోగ్యంగా ఇంటికి పంపాలన్నది సీఎం కేసీఆర్ లక్ష్యం. ఇందులో భాగంగా 2017లో తెలంగాణ డయాగ్నస్టిక్స్ను ప్రారంభించారు.
పీహెచ్సీ మొదలు అన్ని స్థాయిల దవాఖానల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ డయాగ్నస్టిక్స్లో రక్త,మూత్ర పరీక్షలతోపాటు ఎక్స్రే, ఈసీజీ, యూసీజీ వంటి మొత్తం 57 రకాల టెస్టులు నిర్వహిస్తున్నారు. గర్భిణుల కోసం ‘టిఫా’ స్కానింగ్ మెషీన్లు అందుబాటులోకి రానున్నాయి. గుండె సమస్యలను గుర్తించే క్యాథ్ల్యాబ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. 5 ఏండ్లలో తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాల ద్వారా 36 లక్షల మందికిపైగా ప్రయోజనం పొందారు. వీరి నుంచి 69 లక్షల శాంపిళ్లు సేకరించి, 6.5 కోట్ల పరీక్షలు జరిపారు. ప్రైవేట్ ల్యాబ్ల్లో ఈ పరీక్షల విలువ సుమారు రూ.340 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
వైద్య సిబ్బందికి అభినందనలు
పేదలకు ఉచితంగా వైద్యంతోపాటు రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు తెలంగాణ డయాగ్నస్టిక్స్ ప్రారంభమైంది. దీంతో పేదలకు ఆర్థికభారం తప్పుతున్నది. ఈ సేవలకు జాతీయస్థాయి గుర్తింపు రావడం హర్షనీయం. ఇందుకు కృషి చేసిన వైద్య సిబ్బందికి అభినందనలు. రోగ నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తున్నాం.
– మంత్రి హరీశ్రావు
తెలంగాణ డయాగ్నస్టిక్స్లో చేసిన పరీక్షలు (28 అక్టోబర్ 2022 వరకు)
మొత్తం రోగులు – 36,20,789
సేకరించిన శాంపిళ్లు – 68,96,568
చేసిన టెస్టులు – 6,46,59,219
విలువ (అంచనా) – రూ.340 కోట్లు