హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): చీకటిలో ఉన్నవాడే అఖండ దీపాన్ని కాంక్షిస్తాడని.. ప్రకృతి-పంచభూతాల జగత్తులో ప్రామాణికత, పారదర్శకతను పాటించి రచనలు చేసినవారే ప్రఖ్యాత రచయితలుగా నిలుస్తారని ప్రజా వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పేర్కొన్నారు. అంతిమంగా మానవత్వాన్ని ప్రదర్శించేదే మంచి కవిత్వమని వర్ణించారు. ‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో ‘నా తెలంగాణ ప్రగతి ప్రస్థానం.. సాహితీ సప్తాహం’ కార్యక్రమాన్ని శుక్రవారం నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి అధ్యక్షతన రవీంద్రభారతిలోని మినీహాల్లో వైభవంగా నిర్వహించారు.
‘కవిత-పద్యం, పాటలు’ పోటీల విజేతలకు నగదు పురస్కారంతోపాటు బహుమతులు అందజేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన గోరటి వెంకన్న మాట్లాడుతూ.. కవి అంటే సామాజిక చైతన్యంతో పాటు తన పాత్రను సమాజానికి అందివ్వాలని పేర్కొన్నారు. రైతుల కోసం ఆనాడు దాశరథి ఎలాగైతే ఆరాటపడ్డారో.. నేడు కేసీఆర్ కూడా రైతుల కోసమే తపనపడుతున్నారని ప్రముఖ రచయిత్రి ముదిగంటి సుజాతారెడ్డి చెప్పారు. ‘రైతుదే.. తెలంగాణం రైతుదే’ అని దాశరథి నినదించినట్టుగానే, సీఎం కేసీఆర్ కూడా రైతుబీమా, రైతుబంధు తదితర అద్భుతమైన పథకాలతో తెలంగాణ రైతుదేనని చాటిచెప్పారని తెలిపారు.
కవులు, రచయితలను నడిపిస్తున్న నమస్తే తెలంగాణే
కుల, మత ఆధిపత్యానికి చరమగీతం పాడాల్సి వస్తే.. కవులు రచయితలే తమ కలాలతో శంఖారావం పూరిస్తారని రాష్ట్ర సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్ పేర్కొన్నారు. మతం, కులం పేరుతో సమాజాన్ని విడదీసే వారికి తెలంగాణ ఉద్యమగడ్డపై స్థానం లేదని (బీజేపీని ఉద్దేశిస్తూ..) తేల్చిచెప్పారు. కవులు, రచయితలను నడిపిస్తున్న ఒకేఒక్క పత్రిక నమస్తే తెలంగాణ అని కితాబిచ్చారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు సీఎం కేసీఆర్ కీర్తి నలుదిశలా వ్యాపిస్తుందని అధికార భాషా సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి తెలిపారు.
జీవనదులు ఆభరణాలుగా ఉన్నా, తెలంగాణ తల్లి తన బిడ్డలకు బువ్వపెట్టలేక, నీళ్లివ్వలేక అల్లాడిందని గుర్తుచేశారు. నేడు పండిస్తున్న ధాన్యానికి గోదాములు సరిపోవడం లేదని చెప్పారు. ఈ ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని పేర్కొన్నారు. సాహిత్యంపై అనురక్తి-భక్తి ఉంటే అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించవచ్చని భాషా, సాంసృ్కతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ చెప్పారు. దాశరథిలాగే సాహిత్యాన్ని ఒక వాహికగా మలుచుకొని సాగాలని కవులు, రచయితలను కోరారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయా ప్రాంగణాలకు సీఎం కేసీఆర్ తెలంగాణ కవులు, రచయితల పేర్లను పెట్టి సాహిత్యాభిమానాన్ని చాటుకొన్నారని గుర్తుచేశారు.
పిల్లలు పుస్తకాలు చదివేలా ప్రోత్సహించాలి
డిజిటలైజేషన్ ప్రభావం సాహిత్యంపైనా కనిపిస్తున్నదని, కథలు, కవిత్వాలు, రచనలు ఈ తరం వారికి ఆడియోరూపంలో కూడా అందుబాటులోకి వచ్చాయని నమస్తే తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ చిరంజీవులు తెలిపారు. కవిత్వం రాయడానికి పుస్తకపఠనం కీలకమని పేర్కొన్నారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా పిల్లలు పుస్తకాలు చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఆశీస్సులతో సాహితీ సప్తాహం నిర్వహించడం ఎంతో గొప్పవిషయమని పేర్కొన్నారు. నిత్య గోదావరిపై కాటన్ ధవళేశ్వరం.. ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కట్టించి సస్యశ్యామలం చేశారని నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి పేర్కొన్నారు.
ప్రజల గుండెల్లో.. కవుల పలుకుల్లో కేసీఆర్ ఉన్నారని.. మన ప్రాంత భాష, యాస, సాహిత్య పరిరక్షణకు మొదటి నుంచి ‘నమస్తే తెలంగాణ’ నడుంకట్టిందని గుర్తుచేశారు. కవిత్వం శివేతర క్షయాన్ని తొలగించేదై(అశుభాన్ని తొలగించి శుభాన్ని కాంక్షించాలి) ఉండాలని కవి సమూహానికి సూచించారు. సీఎం కేసీఆర్ సాహిత్యాభిమానే కాదు, స్వయంగా సాహితీవేత్త అని, తెలంగాణ రాష్ర్టాన్ని ఏనాడో స్వప్నించారని చెప్పారు. ‘సిపాయిల తిరుగుబాటు విఫలమైందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్య్రం, రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది.. తెలంగాణ వచ్చి తీరుతుంది’ అనే ధీమాతో ఉన్నారని గుర్తుచేశారు.
నగదు బహుమతులు ప్రదానం
పద్య/కవిత విభాగంలో బండకాడి అంజయ్య(సిద్దిపేట)కు ప్రథమ బహుమతిగా రూ.51,116, దాసరి మోహన్ (హైదరాబాద్)కు ద్వితీయ బహుమతిగా రూ.21,116, తైదల అంజయ్యకు తృతీయ బహుమతిగా రూ.11,116 నగదు అందజేశారు. 10 మందికి విశిష్ట బహుమతులు అందజేశారు. పాట విభాగంలో మొదటి బహుమతిగా సంబరాజు రమణికి రూ.51,116, డాక్టర్ వాణీ దేవులపల్లికి ద్వితీయ బహుమతిగా రూ.21,116, రమేశ్కు తృతీయ బహుమతిగా రూ.11,116 అందజేశారు. అనంతరం కవులు, రచయితలను జ్ఞాపికలు, శాలువాలతో నమస్తే తెలంగాణ యజమాన్యం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ డిప్యూటీ ఎడిటర్ పరాంకుశం వేణుగోపాలస్వామి, ఎడిట్పేజీ డెస్క్ ఇన్చార్జి కేవీ రవికుమార్, ఎడిట్ పేజీ చీఫ్ సబ్ఎడిటర్ ఎస్ మల్లారెడ్డి, హైదరాబాద్ ఎడిషన్ ఇన్చార్జి సంతపూరు చిరంజీవి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
పురస్కారాలు అందుకొన్న విజేతలు..
పద్య/కవిత్వ విభాగం:
బండకాడి అంజయ్య(ప్రథమ), దాసరి మోహన్ (ద్వితీయ), తైదల అంజయ్య(తృతీయ)
విశిష్ట బహుమతులు:
గజ్జెల రామకృష్ణ, వేముగంటి మురళి, చిత్తలూరి, గుర్రాల రజిత, దరిపెల్లి కృష్ణమాచార్యులు, మదునూరి సూర్యనారాయణ, చింతోజు పద్మావతి, డాక్టర్ మహమ్మద్ షరీఫ్, సాయి టేకుర్ల, గట్టు మనోహర్రెడ్డి.
పాటల విభాగం:
సంబరాజు రమణి(ప్రథమ), డాక్టర్ వాణీ దేవులపల్లి(ద్వితీయ), కటుకోఝ్వల రమేశ్(తృతీయ)
విశిష్ట బహుమతులు:
వేల్పుల నారాయణ, రాచమల్ల ఉపేందర్, కూర్మాచలం శంకరస్వామి, గసిగంటి రాజలింగం, మడుపల్లి జగదీశ్వర్, మహ్మద్ ఇక్బాల్, సుజాత ప్రసాద్, అల్లి మోహన్రాజ్, వాకిటి రాంరెడ్డి, రాచకొండ రంగన్న
ఆత్మీయ బహుమతులు:
అయాచితం నటేశ్వరశర్మ, గౌరీభట్ల శ్రీనాథశర్మ, వనపట్ల సుబ్బయ్య, తుమ్మల కల్పనరెడ్డి, రామా చంద్రమౌళి, పాలకుర్తి రామమూర్తి, కోట్ల వెంకటేశ్వరరెడ్డి