హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రియల్ ఏస్టేట్ రెగ్యులేటరీ ఆథారిటీ (టీఎస్ రెరా) చైర్మన్గా ఎన్ సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ సో మవారం ఉత్తర్వులు జారీచేశారు. సభ్యులుగా జే లక్ష్మీనారాయణ, శ్రీనివాస్రావును నియమించారు. ఐదేండ్లు వీరు పదవిలో కొనసాగుతారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ ప్రభుత్వానికి రెరా చైర్మన్, సభ్యుల పేర్లను సిఫార్సు చేసింది. సీఎం కేసీఆర్ వీరిలోంచి సత్యనారాయణ పేరును ఖరారు చేశారు. ఆయన ప్రస్తుతం సీడీఎంఏగా పనిచేస్తున్నారు. రెరా చైర్మన్ నియామకపు ప్రక్రియలో భాగంగా గతంలో దరఖాస్తులను ఆహ్వానించారు.
ఖమ్మం జిల్లా కిష్టారం గ్రామానికి చెందిన ఎన్ సత్యనారాయణ 1996లో గ్రూప్1కు ఎంపికయ్యారు. 2009లో ఐఏఎస్గా కన్ఫర్డ్ అయ్యారు. నల్లగొండ జేసీగా, కామారెడ్డి కలెక్టర్గా, సీడీఎంఏగా పనిచేస్తున్నారు. ఈ నెలాఖరున సత్యనారాయణ పదవీ విరమణ చేయనున్నారు. వనపర్తి జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్గా రిటైర్ అయ్యారు. సికింద్రాబాద్కు చెందిన కేశబోయిన శ్రీనివాస్రావు డైరెక్టర్ కంట్రీ టౌన్ ప్లానింగ్గా చేసి రిటైర్డ్ అయ్యారు. తనను రెరా చైర్మన్గా నియమించిన సీఎం కేసీఆర్, సహకరించిన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్లకు సత్యనారాయణ ధన్యవాదాలు తెలిపారు.