National best teachers | దండేపల్లి/భీంపూర్, ఆగస్టు 27: అంకితభావం, విధుల్లో నిబద్ధత, నాణ్యమైన విద్యాబోధన, పిల్లలను బడుల్లో చేర్పించడం వంటి చర్యలతో ప్రభుత్వ పాఠశాలల ఖ్యాతిని పెంచిన ఇద్దరు టీచర్లను జాతీయ అవార్డులు వరించాయి. ఈ ఏడాదికి జాతీయ ఉత్తమ టీచర్లుగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బెనపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ఎన్ అర్చన, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం నిపానికి చెందిన హెచ్ఎం సంతోష్కుమార్ ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి వీరిద్దరికే ఈ పురస్కారం దక్కగా, వీరిద్దరూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసులే కావడం విశేషం. విద్యాలయాలను అత్యుత్తమంగా తీర్చిదిద్ది, విద్యార్థులకు చక్కటి బోధననందిస్తూ జాతీయ స్థాయికి ఎంపికైన వీరిద్దరు ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో (టీచర్స్ డే) వచ్చే నెల 5న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముచేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనున్నారు.
బడిని సమూలంగా మార్చిన అర్చన
2000 సంవత్సరంలో ఉపాధ్యాయురాలిగా ఎంపికైన ఎన్ అర్చన వివిధ పాఠశాలల్లో పనిచేసి.. 2013లో రెబ్బెన్పెల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎంగా బాధ్యతలు చేపట్టారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ, అంకితభావంతో పనిచేస్తూ సమీప గిరిజన గూడేలు, పల్లెల్లోని పిల్లలను బడిలో చేర్పించారు. పాఠశాల అభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రులు, దాతలను భాగస్వాములను చేశారు. గ్రామస్థుల చొరవ, పలు స్వచ్ఛంద సంస్థలు, ఎన్నారైల సహకారంతో పాఠశాలలో వసతులు కల్పించారు. డబుల్ డెస్క్ బెంచీలు, ప్రొజెక్టర్, కంప్యూటర్లు, వాటర్ ప్లాంటు, ఉచిత నోట్బుక్స్, బ్యాగ్స్, సాయంత్రం పూట అల్పాహారం వంటివి సమకూర్చారు. జిల్లాలోనే అత్యధిక విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలగా రెబ్బెన్పెల్లి గుర్తింపు పొందింది. దాతల సహకారానికి తోడుగా హెచ్ఎం అర్చన కూడా ప్రతినెల వేతనం నుంచి రూ.8 వేలు పాఠశాల కోసం ఖర్చు చేస్తున్నారు. అర్చన సేవలకుగాను 2018లో జిల్లా స్థాయి ఉత్తమ అవార్డు, 2019లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకున్నారు. అర్చన పాఠశాలలో చేరిననాడు విద్యార్థుల సంఖ్య 34 ఉండగా, నేడు 270 మంది విద్యార్థులు పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. ఏటా పాఠశాల ఎదుట నో అడ్మిషన్ బోర్డు ఉన్నారు. సాయంత్రం పూట ప్రత్యేక తరగతులు, కరాటే శిక్షణ, ప్రాజెక్ట్ వర్క్, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వెనుకబడిన తరగతులపై ప్రత్యేక శ్రద్ధ, వంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పలగూడెం నుంచి విద్యార్థులను ఆటోల ద్వారా పాఠశాల హెచ్ఎం సొంత ఖర్చులతో రప్పిస్తున్నారు.
డిజిటల్ బోధనలో సంతోష్ దిట్ట
2005లో ఉపాధ్యాయ వృత్త్తిలోకి వచ్చిన బెదోడ్కర్ సంతోష్కుమార్ 2011లో నిపాని ప్రాథమికోన్నత పాఠశాలకు హెచ్ఎంగా వచ్చారు. నాడు విద్యార్థుల సంఖ్య 130 ఉంటే, ప్రస్తుతం 210కి చేరింది. పాఠశాలలో డిజిటల్ బోధనకు ఆయన శ్రీకారం చుట్టారు. సర్వశిక్షా అభియాన్ నుంచి 5 కంప్యూటర్లు, గ్రామస్తుల సహకారంతో 2 ల్యాప్టాప్లు సమకూర్చుకున్నారు. ఇదే పాఠశాల నుంచి రాష్ట్రస్థాయి ఇన్నోవేషన్ ప్రోగ్రాంకు విద్యార్థులు నామినేట్ అయ్యారు.
శుద్ధజలం, బాలికల టాయిలెట్లు, మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం ఇస్తున్నారు. 2013లో ట్రాఫిక్ జామ్ అయితే అంబులెన్స్ రూట్ క్లియర్ ఎలా.. అనే ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపికైంది. 2014లో ఖమ్మం, రంగారెడ్డి , హైదరాబాద్లో ఇక్కడి విద్యార్థులు వ్యవసాయ ప్రాజెక్టులు ప్రదర్శించారు. రాష్ట్రస్థాయిలో ఇప్పటికే 10 వేలమంది సాంఘికశాస్త్రం ఉపాధ్యాయులకు సంతోష్ శిక్షణ ఇచ్చారు. సాంఘిక పుస్తకాల రచనలో ఉన్నారు. ఎస్సీఈఆర్టీ ద్వారా వర్క్షీట్లు రూపొందించారు. మూఢ నమ్మకాల నిర్మూలనకు కృషి చేస్తున్నారు. రాష్ట్ర సోషల్ రిసోర్స్ పర్సన్గా ఉన్నారు. కూడా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం నిరాల గ్రామానికి చెందిన సంతోష్కుమార్ బాల్యంలో పిండిగిర్నీలో పనిచేసేవారు.. తాత రాంచందర్ రజాకార్లను ఎదుర్కొని పోరాటం చేశాడు. ఆయన ప్రేరణతోనే చదువుపై ఆసక్తి పెంచుకున్నారు.. నిజాం కళాశాలలో ఎంఏ బీఎడ్ చేసి టీచర్ ఉద్యోగం సాధించారు.
శ్రమకు గుర్తింపు దక్కింది..
జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. శ్రమకు తగిన గుర్తింపు దక్కింది. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవ ప్రదమైనది. భావి భారతానికి, మెరుగైన సమాజానికి పునాది వేసేది ఉపాధ్యాయులే. అలాంటి వృత్తిలో కొనసాగుతున్నందుకు సంతోషంగా ఉంది. జాతీయ అవార్డుతో బాధ్యత మరింత పెరిగింది.
-బీ సంతోష్ కుమార్, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు, నిపాని
బాధ్యత పెరిగింది..
జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికవడం చాలా సంతోషాన్ని కలిగించింది. మరింత భాద్యతను కూడా పెంచింది. మా గురువు, మామిడిపెల్లి హెచ్ఎం పర్వతి సత్యనారాయణ గారి సలహాలు, సూచనలు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. అవార్డు రావడానికి కారణం అయ్యాయి. పాఠశాల అభివృద్ధి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కారణంగా ఈ అవార్డు వచ్చింది.
-ఎన్ అర్చన, హెచ్ఎం, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలు.