నందికొండ, మే 18 : నల్లగొండ జిల్లా నందికొండ హిల్కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బుద్ధవనం బౌద్ధులకు నందన వనమని మయన్మార్ సాంస్కృతిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ న్యోమిన్టున్ అన్నారు. బౌద్ధ వారసత్వ కట్టడాలు, బౌద్ధ సంస్కృతి అధ్యయన యాత్రలో భాగంగా మయన్మార్ మత వ్యవహారాలు, సాంస్కృతిక సంబంధాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల బృందం గురువారం బుద్ధవనం సందర్శించింది.
ఈ సందర్భంగా న్యోమిన్టున్ మాట్లాడుతూ.. బుద్ధవనంలో స్థూపాలు, శిల్పాలు ఎక్కడా చూడలేదని, రానున్న రోజుల్లో బుద్ధవనం ప్రపంచ స్థాయి బౌద్ధ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుందని పేర్కొన్నారు. బౌద్ధ వారసత్వ థీమ్ పార్కుగా బుద్ధవనాన్ని అభివృద్ధి పరిచిన రాష్ట్ర ప్రభుత్వం, బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్యకు అభినందనలు తెలిపారు. మయన్మార్ నుంచి బుద్ధవనానికి పర్యాటక బృందాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బుద్ధవనంలోని విశేషాలను బుద్ధవనం నిపుణులు ఈమని శివనాగిరెడ్డి బృందం సభ్యులకు వివరించారు.