హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో విద్యుత్రంగం ఎవరూ ఊహించనివిధంగా బలోపేతమై ఇతర రాష్ర్టాలకు స్ఫూర్తిగా పురోగమిస్తున్నదని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు అన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మార్గదర్శనం, విద్యుత్ సంస్థల్లోని అన్నిస్థాయిల ఉద్యోగుల కలిసికట్టుగా పనిచేయటం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రజలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును అందించడంలో ప్రభుత్వానికి అండగా నిలువాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్పై శుక్రవారం ఎర్రగడ్డలోని విద్యుత్శక్తి ఆడిటోరియంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, డైరెక్టర్లు టీ శ్రీనివాస్, శ్రీనివాస్రెడ్డి, ట్రాన్స్కో డైరెక్టర్ జగత్రెడ్డి, విద్యుత్తు ఇంజినీర్లు, ఉద్యోగులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వేసవిలో పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్ నేపథ్యంలో ఉద్యోగులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
విద్యుత్తురంగంపై రాష్ట్ర ప్రజలకు అపారమైన నమ్మకం ఉండటంవల్లనే రోజురోజుకూ విద్యుత్తు కనెక్షన్లు పెరుగుతున్నాయని, తద్వారా గరిష్ఠ డిమాండ్ పెరుగుతున్నదని ప్రభాకర్రావు అన్నారు. శుక్రవారం రాష్ట్రంలో 13,527 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ నమోదయ్యిందని, ఇది ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలంగాణ రాష్ట్రంలోనూ ఆల్ టైం రికార్డు అని వెల్లడించారు. గత పదిరోజులుగా గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ 13 వేల మెగావాట్లకుపైగానే ఉందని చెప్పారు. ఇది ఉమ్మడిరాష్ట్రంలో నమోదైన గరిష్ఠ విద్యుత్తు డిమాండ్కన్నా చాలా ఎక్కువ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కొద్ది నెలలముందు 2014 ఫిబ్రవరి 28న 13,126 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ ఏర్పడింది. మార్చి మొదటి పక్షంలోనే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో విద్యుత్తు డిమాండ్ మరింత పెరిగి 14,500 మెగావాట్ల వరకు నమోదయ్యే అవకాశం ఉందని, ఇందుకు విద్యుత్ సంస్థల ఇంజినీర్లు, కార్మికులు, ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని ప్రభాకర్రావు సూచించారు. రూ. 35,500 కోట్లతో 18,000 మెగావాట్ల డిమాండ్ వచ్చినా సరఫరాలో ఇబ్బందులు రాకుండా విద్యుత్తు ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలను పటిష్టం చేశామని తెలిపారు. ఈనెల 14న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడా విద్యుత్తు సరఫరాకు అవాంతరాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్తు ఉద్యోగులంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు.
విద్యుత్తురంగం అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చిందని ప్రభాకర్రావు తెలిపారు. ‘నిరంతర విద్యుత్ సరఫరా కోసం సీఎం కేసీఆర్ ఫ్రీడం ఇచ్చారు. ప్రమోషన్లు ఇచ్చి, వేతనాలు పెంచారు. 24 గంటల విద్యుత్తు అందించటంలో మనమంతా అండగా ఉండాలని పేర్కొన్నారు. విద్యుత్తు డిమాండ్ రికార్డు గరిష్ఠస్థాయికి చేరినా ఎక్కడా పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు విఫలం కాలేదని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. విద్యుత్తు వ్యవస్థలను బలోపేతం చేసుకొంటే, ప్రైవేటుపరం చేయాలని కేంద్రం ప్రయత్నిస్తున్నదని పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నాకర్ విమర్శించారు.