హైదరాబాద్ : కరోనా నియంత్రణకు అన్ని విధాలుగా పంచాయతీ రాజ్ శాఖ సిబ్బంది ఫ్రంట్ లైన్ వారియర్స్గా పని చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి పనుల పై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఉమ్మడి హబూబ్ నగర్ జిల్లా మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..కరోనా నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఉపాధి హామీ నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పల్లె ప్రగతిని నిరంతరం నిర్వహించాలన్నారు. పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం అవడంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల కృషి మరువలేనిదన్నారు. గతం లాగే ఈసారి కూడా రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలని మంత్రి సూచించారు.