హైదరాబాద్ సిటీబ్యూరో/బంజారాహిల్స్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డిపై హత్యా యత్నం జరిగింది. జీవన్రెడ్డి అప్రమత్తతతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. హత్యకు కుట్ర పన్నిన వ్యక్తి ఆర్మూర్ నియోజకవర్గంలో సస్పెన్షన్కు గురైన ఒక సర్పంచ్ భర్త. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని వేమిరెడ్డి ఎన్క్లేవ్లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి నివాసం ఉంటున్నారు. సోమవారం రాత్రి 8.15 గంటల ప్రాంతంలో మక్లూర్ మండలం కల్లాడి గ్రామ సర్పంచ్ (సస్పెన్షన్కు గురైన) పెద్దగాని లావణ్య భర్త ప్రసాద్గౌడ్ ఎమ్మెల్యే ఇంటికి వచ్చాడు.
టీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ భర్త కావడం, గతంలో కూడా పలుమార్లు ఎమ్మెల్యే ఇంటికి రావడంతో ప్రసాద్గౌడ్ను సెక్యురిటీ సిబ్బంది లోనికి అనుమతించారు. ఎమ్మెల్యేను కలిసేందుకు వచ్చానని చెప్పడంతో విజిటర్స్ రూమ్లో కూర్చోవాలని చెప్పారు. కొద్దిసేపటికి ఆయన లిఫ్ట్లో మూడో ఫ్లోర్లోకి వెళ్లాడు. అక్కడ పనిమనుషులకు కనిపించకుండా జీవన్రెడ్డి గదిలోకి ప్రవేశించాడు. అతడిని చూసి జీవన్రెడ్డి షాక్కు గురై లోపలికి ఎలా వచ్చావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తన భార్య సస్పెన్షన్ విషయం తేల్చాలని, ఎన్ని రోజులు నాన బెడ్తావని గట్టిగా అరుస్తూ వెంట తెచ్చుకున్న తుపాకీని ఎమ్మెల్యేకు గురి పెట్టాడు. వెంటనే జీవన్రెడ్డి గట్టిగా అరవడంతో సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకొని ప్రసాద్గౌడ్ను పట్టుకొని కిందకు తీసుకెళ్లి తనిఖీ చేశారు. అతని వద్ద తుపాకీ, పదునైన కత్తి లభించాయి. అతని కారులో మరో తుపాకీ దొరికింది. ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, అతడి కారును స్వాధీనం చేసుకున్నారు. గతంలో బీజేపీలో ఉన్న ప్రసాద్గౌడ్ ఏడాదిన్నర క్రితమే టీఆర్ఎస్లో చేరాడు. సర్పంచ్గా ఎన్నికైన అతని భార్య లావణ్యపై పలు ఆరోపణలు రావడంతో అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యే ఇంటికి ప్రసాద్తోపాటు మరో ఇద్దరు వచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. ప్రసాద్గౌడ్కు గతంలో నేర చరిత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
జీవన్రెడ్డిని పరామర్శించిన స్పీకర్
బీర్కూర్ అగస్టు 2 : హత్య కుట్ర నుంచి క్షేమంగా బయటపడిన ఎమ్మెల్యే జీవన్రెడ్డిని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లిన సభాపతి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి ఉన్నారు.