నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే బీజేపీ కుట్రలు, కుయుక్తులకు తెర లేపిందని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పలివెలలో బీజేపీ గూండాల దాడిపై తీవ్రంగా స్పందించారు. ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచే రకరకాల కవ్వింపు చర్యలకు బీజేపీ పాల్పడుతున్నదని మండిపడ్డారు. టీఆర్ఎస్కు మద్దతుగా ఉన్న మహిళలు, వృద్ధులను గుర్తించి, గ్రామాల్లో తిరుగుతూ మాయమాటలు చెబుతూ వారి చేతులపై కమలం గుర్తు వేస్తున్నారని, తద్వారా వారిని ఓటుకు దూరం చేయాలని బీజేపీ కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు.
ఎన్ని చేసినా ప్రజలు టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతుండటంతో ఘర్షణలకు కూడా వెనుకాడటం లేదని పేర్కొన్నారు. పలివెలలో కావాలనే ఘర్షణలు సృష్టించి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ములుగు జడ్పీ చైర్మన్ జగదీశ్పై దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా ఆ పార్టీ అధ్యక్షుడే కొట్టండి.. తన్నండి అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కోమటిరెడ్డి సోదరులకు దాడుల సంస్కృతి వెన్నతో పెట్టిన విద్య అని, గతంలో సొంత పార్టీ నేతలపైనే దాడులు చేయించిన చరిత్ర వాళ్లదని గుర్తు చేశారు. ఉప ఎన్నికల్లో ఓటమి స్పష్టంగా కనిపిస్తున్నదని, దాన్ని జీర్ణించుకోలేకే దాడులకు తెగబడుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ నేతల వ్యవహారంపై రాజ్యంగబద్ధ సంస్థల తీరు సరిగ్గా లేదని ఆరోపించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు అందరూ సంయమనం పాటించాలని, ఉప ఎన్నికలో పోలింగ్ ముగిసే దాకా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. మునుగోడులో బీజేపీ నేతలు దాడులు చేసినా, కుట్రలు కుతంత్రాలు చేసినా.. గెలిచేది టీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలువబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు.