గతంలో ఏ ప్రభుత్వం మున్నూరుకాపులను ఆదుకోలేదు
బీసీల అభ్యున్నతే సర్కార్ ధ్యేయం
వచ్చే నెల 9న మున్నూరుకాపు ఆత్మగౌరవ భవనానికి భూమిపూజ
వద్దిరాజు రవిచంద్ర అభినందన సభలో మంత్రి గంగుల కమలాకర్
హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మున్నూరు కాపులు అందరూ సీఎం కేసీఆర్కు అండగా నిలవాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖమంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మున్నూరుకాపులను మునుపెన్నడూ ఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా ఆదుకోలేదని చెప్పారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బీసీలు ఎదగాలన్న తపనతో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని తెలిపారు. వద్దిరాజు రవిచంద్రను రాజ్యసభకు ఎంపిక చేసిన సీఎం కేసీఆర్కు రాష్ట్రంలోని మున్నూరుకాపులు రుణపడి ఉండాలని చెప్పారు. వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు అనంతరం గురువారం పబ్లిక్గార్డెన్స్లో మున్నూరుకాపు సంఘం నాయకుడు కొండ దేవన్న అధ్యక్షతన జరిగిన అభినందన సభకు మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రిగా, ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా, ఆర్టీసీ చైర్మన్గా, కార్పొరేషన్ చైర్మన్లుగా మొత్తంగా గల్లీస్థాయి నుంచి ఢిల్లీస్థాయి దాకా మున్నూరు కాపులకు అవకాశం కల్పించారని చెప్పారు.
రాష్ట్రంలో మున్నూరుకాపులు తమ ఐక్యత ప్రదర్శించారని, ఇదే స్ఫూర్తితో మిగతా బీసీ కులాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాల హయాంలో కనీసం 5 గుంటల జాగా ఇస్తే ఆత్మగౌరవ భవనం కట్టుకుంటామన్నా కనికరించలేదని, అదే సీఎం కేసీఆర్ వేల కోట్ల విలువ చేసే భూములను బీసీ కులాలకు కేటాయించారని వివరించారు. అందులో భాగంగానే మున్నూరుకాపుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి జూన్ 9న భూమిపూజ చేయనున్నామని సభికుల హర్షద్వానాల మధ్య మంత్రి గంగుల ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, రాష్ట్ర చిన్ననీటి వనరుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వీ ప్రకాశ్, రాష్ట్ర రోడ్ల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, రాష్ట్ర మహిళాభివృద్ధి సంస్థ చైర్పర్సన్ ఆకుల లలిత, హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మున్నూరుకాపు సంఘం ప్రతినిధులు వైద్యం వెంకటేశ్వర్లు, పుట్టం పురుషోత్తం, జల్లి సిద్ధయ్య, జగతి, కటకం పెంటయ్య, బండి కుమారస్వామి పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడతా: వద్దిరాజు రవిచంద్ర
ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. పార్టీ అభ్యున్నతి, రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పారు. కష్టపడి చిత్తశుద్ధితో పనిచేసిన వారికి అవకాశాలు తప్పకుండా వస్తాయని చెప్పటానికి తానే ఉదహరణ అన్నారు. బీసీ అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పదికాలాలపాటు కాపాడుకోవాల్సిన అవసరం ప్రతీ ఒక్కరిపైనా ఉన్నదని తెలిపారు.