హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మున్సిపల్ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని తమిళనాడు అధికారుల బృందం ప్రశంసించింది. మున్సిపల్ పరిపాలనలో సంస్కరణలు బాగున్నాయని కితాబిచ్చింది. బుధవారం అధికారుల బృందం జవహర్నగర్లో శాస్త్రీయ పద్ధతిలో డంప్యార్డ్ నిర్వహణ, వ్యర్థాల నుంచి విద్యుత్తు తయారీ, భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్లు, స్వచ్ఛ ఆటోల వినియోగం, స్వచ్ఛ కార్యక్రమాలను పరిశీలించింది. అనంతరం బీఆర్కే భవన్లో సీఎస్ సోమేశ్ కుమార్ను కలిసింది.
ఈ సందర్భంగా ఆ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, మంచినీటి సరఫరా అడిషనల్ చీఫ్ సెక్రటరీ శివదాస్ మీనా మాట్లాడుతూ.. తెలంగాణలో వ్యర్థాల నిర్వహణ తీరు బాగున్నదని పేర్కొన్నారు. వీటిని తమిళనాడులో అమలుచేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. కార్యక్రమంలో గ్రేటర్ చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ముఖ్య కార్యదర్శి గగన్ దీప్సింగ్ బేడీ, జాయింట్ సెక్రటరీ జాన్ లూయిస్, మున్సిపల్శాఖ డైరెక్టర్ పొన్నయ్య, చెన్నై కార్పొరేషన్ సీనియర్ అధికారులు, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ సంతోష్ పాల్గొన్నారు.
దేశానికి దిక్సూచిగా తెలంగాణ: సీఎస్ సోమేశ్
అభివృద్ధిలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజనలో టాప్ 20లో మొదటి 19 గ్రామాలు తెలంగాణవే కావటం హర్షణీయమని అన్నారు. బుధవారం బీఆర్కే భవన్లో సీఎస్ అధ్యక్షతన ‘సంసద్ ఆదర్శ్’ పథకం రాష్ట్ర స్థాయి సాధికారత కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను పల్లె ప్రగతి ద్వారా సమర్థంగా అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో అధికారుల కృషి గొప్పదని, ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని సూచించారు.
సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, యువజన సర్వీసుల ముఖ్య కార్యదర్శి సబ్యసాచి ఘోష్, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శరత్ పాల్గొన్నారు.