హైదరాబాద్ జనవరి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోని భారీ, ఎత్తయిన భవనాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, దవాఖానలు, పాఠశాలలు, అపార్ట్మెంట్లలో అగ్నిమాపక తనిఖీలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాలు, వాటి నివారణ, అనుమతులపై బీఆర్కే భవన్లో మంత్రులు, అధికారులతో ఆయన బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఫైర్సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని చెప్పారు. మున్సిపల్, పోలీస్, ఫైర్, తదితర శాఖల అధికారులు సమయన్వంతో పనిచేస్తూ.. నిర్ణీత కాలంలో తనిఖీలు పూర్తిచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా దవాఖానలు, పాఠశాల భవనాలు, పెట్రోల్ బంకులు, గ్యాస్ గోదాములు, వాణిజ్య భవనాలు, ఎత్తయిన అపార్టుమెంట్లలో తప్పనిసరిగా తనిఖీలు చేపట్టాలని చెప్పారు. గణనీయంగా పెరుగుతున్న నగర జనాభాకు భద్రత కల్పించడమే తమకు అత్యంత ముఖ్యమైన అంశమని, అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫైర్ సేఫ్టీ తనిఖీల పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. అవసరమైతే 1999లో రూపొందించిన ఫైర్ సేఫ్టీ చట్టాలను మార్చేందుకు తగిన ప్రతిపాదనలు పంపాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ నగరాల్లో భారీ అగ్ని ప్రమాదాలు జరుగకుండా సరైన మార్గదర్శకాలు సూచించడానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. హైదరాబాద్లో దాదాపు 25 లక్షల వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఉన్నాయని, అవన్నీ తమ సొంత ఫైర్ సేప్టీ జాగ్రత్తలు తీసుకొనేవిధంగా తగిన మార్గదర్శకాలు జారీచేయాలని అన్నారు. హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ భవన నిర్మాణాలకు అనుమతులు జారీ చేసే సమయంలోనే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నిబంధనలు అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ భారీ అగ్నిప్రమాదాలు జరుగకుండా చేపట్టాల్సిన చర్యలపై తగు ప్రతిపాదనలు సమర్పించడానికి ఉన్నతస్థాయి అధికారుల కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఫైర్ సేఫ్టీ తనిఖీల్లో సహకరించని, నిబంధనలు పాటించని వ్యాపార, వాణిజ్య సంస్థలపై ప్రత్యేక చర్యలు తీసుకొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. ఈ సమీక్షలో హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, మున్సిపల్శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అర్వింద్కుమార్, ఇంధన, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సునీల్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్, హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్, మేడ్చల్ కలెక్టర్ హరీశ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వేసవి సమీపిస్తున్న తరుణంలో అటవీ రక్షణకు, అగ్ని ప్రమాదాల నివారణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియాల్ అన్నారు. అరణ్య భవన్లో రెండు రోజుల పాటు అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్లు, జిల్లా అటవీ అధికారులు, డివిజనల్ ఫారెస్ట్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అడవులపై పెరిగిన ఒత్తిడి కారణంగా రక్షణ చర్యల విషయంలో రాజీ పడవద్దని కోరారు. వేసవిలో అగ్ని ప్రమాదాల రూపంలో అడవులకు ముప్పు పొంచి ఉంటుందని, నివారణ కోసం బీట్ల వారీగా ప్రణాళికలు ఉండాలని సూచించారు. వేసవిలో వన్యప్రాణుల తాగునీటి కోసం తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో కంపా నిధులు, పనులు, పురోగతి, అటవీ అనుమతుల ప్రక్రియ వేగవంతం, గిరిజన గూడేలకు మౌలిక సదుపాయాల కల్పన, అటవీ నేరాల కేసుల సత్వర పరిషారం, తదితర విషయాలపై చర్చించారు. పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైస్వాల్, పీసీసీఎఫ్ (ఎఫ్ సీఏ) ఎంసీ పర్గెయిన్, పీసీసీఎఫ్(విజిలెన్స్) ఏలూసింగ్ మేరు, అన్ని సరిళ్లకు చెందిన చీఫ్ కన్జర్వేటర్లు, జిల్లా అటవీ అధికారులు, డివిజనల్ ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని భవనాలపై సేఫ్టీ తనిఖీలు నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ నగరంలో అక్రమ కట్టడాలు, ఫైర్ సేఫ్టీ పాటించని భవనాలను గుర్తించేందుకు ఒక ప్రత్యేక కమిటీని నియమించనున్నామని తెలిపారు. ఈ కమిటీ ప్రైవేటు భవనాలతోపాటు ప్రభుత్వ భవనాల నిర్మాణాలను పరిశీలిస్తుందని చెప్పారు. అగ్ని ప్రమాదం జరిగిన నల్లగుట్ట భవనాన్ని కూల్చేందుకు రూ.41 లక్షలకు టెండర్ ఖరారైందని తెలిపారు. గురువారం నుంచి కూల్చివేత ప్రారంభిస్తామన్నారు. చిన్నపరిణామంలో ఉండే అగ్ని మాపక యంత్రాలను వినియోగించడంపై ఆలోచిస్తున్నామని చెప్పారు. భవనాల్లో సామర్థ్యానికి మించి వస్తువుల నిల్వ వల్ల అగ్ని ప్రమాదాల ఉధృతి పెరుగుతున్నదని అన్నారు. కొన్ని భవనాల్లో నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లలో షాపులు, ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, ప్రమాదకరమైన వస్తువులు నిల్వ చేస్తున్నారని తెలిపారు. భవన నిర్మాణాలపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.
హైదరాబాద్లోని ఎత్తయిన అపార్ట్మెంట్లతోపాటు, పాతబస్తీలో ఇరుకు సందుల్లోని భవనాల్లో సైతం తనిఖీలు చేపట్టాలని చెప్పారు. అగ్నిమాపక శాఖకు కూడా ఆధునిక వాహనాలు, అగ్నిమాపక యంత్రాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. అగ్నిమాపక శాఖకు కావాల్సిన వాహన, వస్తు, యంత్ర సామగ్రి కోసం అవసరమైన ప్రతిపాదనలను వెంటనే పంపాలని సీఎస్ శాంతికుమారిని కోరారు. సికింద్రాబాద్లోని రాంగోపాల్పేటలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తామని ప్రకటించారు. సకాలంలో స్పందించి ఎక్కువ ప్రాణనష్టం జరుగకుండా చర్యలు తీసుకున్న ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలు నిబంధనల మేరకు జరుగుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. ఇందులో రాజకీయం ఏమి ఉండబోదని స్పష్టం చేశారు. కేసీఆర్ పుట్టిన రోజున సచివాలయం ప్రారంభిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఆ భవనంలో సీఎం జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడంలేదని చెప్పారు. మోదీ పుట్టిన రోజు నాడు కేంద్ర ప్రభుత్వం ఏదైనా కడితే దాన్ని ప్రారంభించుకోవచ్చన్నారు. ప్రతి దాన్ని వివాదం, రాజకీయం చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని విమర్శించారు.