హైదరాబాద్ : కంటి చూపులేని వారి కోసం దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం బ్రెయిలీ లిపిలో మున్సిపల్ చట్టాన్ని ముద్రించింది. దీన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి చూపులేని వారికి కూడా మున్సిపల్ చట్టాన్ని అందుబాటులోకి తీసుకరావాలనే ఆలోచనలో భాగంగానే బ్రెయిలీ లిపిలో మున్సిపల్ చట్టాన్ని ముద్రించినట్లుగా మంత్రి కేటీఆర్ తెలిపారు.
మంగళవారం ప్రగతిభవన్లో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, సీడీఎంఏ ఎన్ సత్యనారాయణతో కలిసి బ్రెయిలీ లిపిలో ముద్రించిన మున్సిపల్ చట్టం 2019 పుస్తకాన్నిరాష్ట్ర మంత్రి కే తారక రామారావు ఆవిష్కరించారు. రాష్ట్రంలో రోజు వారీ వ్యవహారాల్లో అనేక మందికి మున్సిపల్ చట్టం అవసరం ఉంటుందని, ఈ నేపథ్యంలో కంటి చూపు లేని వారి కోసం బ్రెయిలీ లిపిలో ముద్రించామన్నారు. బ్రెయిలీలో ముద్రించిన పుస్తకం అనేక మందికి ఉపయోగపడుతుందని,
దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ సీడీఏంఎ ఎన్.సత్యనారాయణ, ఇతర అధికారులను కేటీఆర్ అభినందించారు. మున్సిపల్ చట్టాన్ని దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా, పారదర్శకంగా ఉండే విధంగా రూపొందించడం జరిగిందన్నారు. దివ్యాంగులు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందన్నారు. వారికి ఆసరా పింఛన్, కింద నెలకు రూ.3016 ఇస్తుందన్నారు. దీనితో పాటుగా మూడు చక్రాల వాహనాలు, ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు.
దివ్యాంగుల కోసం మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని అన్నారు. ఇప్పటికే మున్సిపల్ చట్టం తెలుగు, ఇంగ్లిష్లో ముద్రించడం జరిగిందన్నారు. ఉద్యోగులు, కంటి చూపులేని వారు సులభంగా ఉపయోగించుకునే విధంగా ముద్రించామన్నారు. వారు ఎదుర్కొనే సందేహాలు, సమస్యలపై అవగాహన ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, దివాకర్ రావు, మాగంటి గోపినాథ్ పాల్గొన్నారు.