మహబూబ్నగర్ : మున్సిపల్ కౌన్సిలర్లు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన మహబూబ్నగర్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ముందుగా మంత్రి హౌసింగ్ బోర్డ్ కాలనీలో రూ. 30 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కౌన్సిలర్లు ప్రజలమధ్య ఉన్నప్పుడే వారి సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ముఖ్యంగా ప్రతిరోజు వార్డుల్లో పర్యటించి తాగునీరు, పారిశుద్ధ్యం, వంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు.
ప్రజలు కూడా స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు కౌన్సిలర్ల దృష్టికి తీసుకురావాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు లేని వారందరికి దశలవారీగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తుందని, ఒకవేళ ఎవరికైనా సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకునేందుకు సహకారం ఇస్తామని తెలిపారు.
కొత్త పెన్షన్లు కూడా త్వరలోనే మంజూరు చేస్తామని వెల్లడించారు.
కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ కె సి నరసింహులు, డీసీసీబీ ఉపాధ్యక్షుడు కోరమోని వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేష్, కౌన్సిలర్లు యాదమ్మ, వనజ , మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.