ములుగు : పని చేద్దామంటే చూపు లేదు.. తిండి తిందామంటే పైసల్లేవు.. చలికి వణుకుతూ.. ఆకలితో అలమటిస్తున్న ఆ అంధురాలికి ఓ సబ్ రిజిస్ట్రార్ అండగా నిలిచారు. మానవత్వంతో కడుపు నిండా అన్నం పెట్టి.. అమ్మలా, దుస్తులు, దుప్పట్లు, పండ్లు ఇప్పించి నాన్నలా ఆదరించారు. ఎవరూ లేని ఆ అభాగ్యురాలిని చేరదీసి.. సఖి సెంటర్కు తరలించారు. అంత గొప్ప మనసు చాటుకున్న సబ్ రిజిస్ట్రార్ ఎవరో కాదు.. మన ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్.
ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ సోమవారం సాయంత్రం తన విధులను ముగించుకుని ములుగు బస్టాండ్కు చేరుకుంది. అయితే ఆ బస్టాండ్లో ధీనస్థితిలో ఉన్న ఓ అంధురాలి గురించి.. తస్లీమాకు ఆర్టీసీ సిబ్బంది తెలిపారు. తక్షణమే సబ్ రిజిస్ట్రార్.. ఆ అంధురాలి వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకుంది. తన పేరు రమ, ఏటూరు నాగారం అని తెలిపింది. తాను కొన్ని సంవత్సరాల క్రితం చూపు కోల్పోయానని, తనకెవరూ లేరని పేర్కొంది. తనను ఎవరో తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారని, ఉదయం నుంచి ఏం తినలేదని ఆకలిగా ఉందని తస్లీమాకు తెలిపింది అంధురాలు.
ఆమె మాటలకు చలించిపోయిన సబ్ రిజిస్ట్రార్.. క్షణాల్లోనే అన్నం తెప్పించి, తినిపించారు. బట్టలు, దుప్పట్లు, పండ్లు అందించారు. అనంతరం అంధురాలిని సఖి సెంటర్కు తరలించారు. ఆమె ఆధార్ కార్డు ఆధారంగా ఆసరా పెన్షన్ వచ్చేలా చేస్తానని తస్లీమా హామీ ఇచ్చారు. అంధురాలు రమకు ఎవరైనా తెలిసిన వారు ఉంటే తనను సంప్రదించాలని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా తెలిపారు.