Mavoists | త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా మావోయిస్టులు కుట్రకు తెర తీశారు. తెలంగాణ రాష్ట్ర పరిధిలో దాడులకు మావోయిస్టుల కుట్రను ములుగు జిల్లా పోలీసులు భగ్నం చేశారు. మంగళవారం 30-40 మంది మావోయిస్టులు ములుగు జిల్లా పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కర్రెగుట్ట ప్రాంత గుట్టలపై తిష్ట వేశారని తెలిసింది. ఈ సమాచారం తెలిసిన జిల్లా ఎస్పీ గౌష్ ఆలం, ఓఎస్డీ అశోక్ కుమార్ సారధ్యంలో ములుగు జిల్లా పోలీసులు, గ్రేహౌండ్స్ పోలీసులు కలిసి బుధవారం ఆపరేషన్ చేపట్టారు.
పోలీసు బలగాలను చూసిన మావోయిస్టులు.. తమ వస్తువులు ఎక్కడివక్కడే వదిలేసి దట్టమైన అడవుల్లోకి తప్పించుకున్నారు. వారిని పోలీసులు వెంటాడినా దట్టమైన అడవుల్లో పారిపోయారు. తదుపరి ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పోలీసులు గాలించారు. అక్కడ వదిలి వెళ్లిన కిట్ బ్యాగుల్లో ఆలీవ్ గ్రీన్ డ్రెస్, ఇతర దుస్తులు, బట్టలు, దుప్పట్లు, వస్తువులు, సుత్లీ బాంబు, రేడియోలు, సోలార్ ప్లేట్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, పాత్రలు, కిరాణా వస్తువులు, దోమతెరలు, విప్లవ సాహిత్యం, ఔషధాలు, తదితర వస్తువులు దొరికాయి. కర్రెగుట్ట ప్రాంతంలో పోలీసులు ఇంకా తనిఖీలు కొనసాగిస్తున్నారు.
అడవిలో తిష్ట వేసిన వారిలో సాంబయ్య అలియాస్ గోపన్న, కంకణాల రాజి రెడ్డి అలియాస్ వెంకటేష్, ఎగోలపు మల్లయ్య అలియాస్ మల్లేశం, భద్రు అలియాస్ పాపన్న, ముచ్చకి ఉంగల్ అలియాస్ రఘు అలియాస్ సుధాకర్, కొవ్వాసి గంగ అలియాస్ మహేష్ అలియాస్ జనార్ధన్, నల్లమారి అశోక్ అలియాస్ విజయేందర్, పూనెం అడుమయ్య అలియాస్ గణేష్, కొవ్వాసి రాము, మడకం మంగ అలియాస్ మాసా, కుంజ వీరయ్య అలియాస్ లచ్చన్న, లక్ష్మణ్, సాంబయ్య అలియాస్ ఆజాద్, పొడియం కొసయ్య అలియాస్ సుకురామ్, ముస్సాకి దేవల్ అలియాస్ కరుణాకర్, వెట్టి లక్మా అలియాస్ కల్లు, కుంజం ఇడుమ అలియాస్ మహీందర్, కారం బుద్రి అలియాస్ రీటా, శ్యామల దూలే, ముస్సాకి జమున, సోడి కోసి అలియాస్ ఝాన్సీ తదితరులు ఉన్నట్లు సమాచారం. మావోయిస్టులకు సహకరించవద్దని ములుగు జిల్లా ప్రజలను పోలీసులు కోరారు. మావోయిస్టుల సమాచారం తెలిసిన వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు.