జయశంకర్ భూపాలపల్లి : ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకున్న ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆమె భర్త జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాను రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు. మంగళవారం భూపాలపల్లిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని మంత్రి సందర్శించి, కలెక్టర్ దంపతులను పలుకరించారు. వారికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించడం ద్వారా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చిందన్నారు. ప్రజల్లో విశ్వాసం నెలకొల్పేందుకు కలెక్టర్ దంపతులు ప్రసవం కోసం ప్రభుత్వ దవాఖానను ఎంపిక చేసుకోవడం ప్రశంసనీయమని మంత్రి కొనియాడారు. అనంతరం మంత్రి కలెక్టర్ దంపతులకు కేసీఆర్ కిట్ను అందజేశారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా దంపతులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్రావు ట్విట్టర్ ద్వారా అభినందించారు. ప్రభుత్వ దవాఖానల్లో కల్పిస్తున్న సౌకర్యాలకు ఇది నిదర్శనమన్నారు. ప్రజల్లో నమ్మకం పెంచే దిశగా ప్రసవానికి ప్రభుత్వ ఆస్పత్రిని ఎంపిక చేసుకున్నందుకు కలెక్టర్ దంపతులు ఆదర్శప్రాయమని మంత్రి కొనియాడారు.
Congratulations to @Collector_JSK & Addl Collector Mulugu on delivering baby boy at district Area hospital.
It is a matter of immense pride that health infrastructure in the state under able leadership of #CMKCR Garu, became first choice of people. pic.twitter.com/XNJRepCCoZ
— Harish Rao Thanneeru (@trsharish) October 4, 2022