హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని అనాథ ఆశ్రమాల్లో ఉన్న పిల్లలందరికీ అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఆ చిన్నారులకు ప్రభుత్వమే తల్లి, తండ్రిలా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. రాష్ట్రంలోని 24 అనాథ శరణాలయాల్లోని 946 మంది చిన్నారులకు మల్టీ స్పెషాలిటీ స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, చాయిస్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో హైదరాబాద్లోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో సోమవారం చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్యలక్ష్మి ద్వారా పౌష్ఠికాహారాన్ని అందిస్తున్నామని వివరించారు. చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించటం ద్వారా భవిష్యత్తులో ఎటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడేందుకు దోహదం చేస్తాయని చెప్పారు. వారికి ఆరోగ్య కార్డులు కూడా జారీ చేస్తున్నామని తెలిపారు. అనాథ పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహిం చి వారి బాగోగులను పర్యవేక్షించటం పవిత్ర కార్యమని రాష్ట్ర బాలల హకుల కమిషన్ చైర్మన్ శ్రీనివాస్రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యాదేవరాజన్, చాయిస్ ఫౌండేషన్కు చెందిన సతీశ్ ఘంటా తదితరులు పాల్గొన్నారు.
వైద్య పరీక్షల వివరాలు ఇవీ..
రాష్ట్ర ప్రభుత్వం, చాయిస్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పీడియాట్రిషియన్, నియోనాటాలజిస్ట్, సతీశ్ ఘంటా నేతృత్వంలోని 21 మంది మల్టి స్పెషాలిటీ వైద్య బృందం సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నది. సోమవారం వరంగల్కు చెందిన 98 మంది అనాథ పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే హైదరాబాద్కు చెందిన 331 మంది, నారాయణఖేడ్, సంగారెడ్డి, అచ్చంపేట, మహబూబ్నగర్, మెదక్, జనగామ, గద్వాల, సిద్దిపేట జిల్లాలకు చెందిన 185 మంది అనాథలకు పరీక్షలు నిర్వహించారు. పీడియాట్రిక్ కార్డియాలజీ, ఆప్తాల్మాలజీ, ఈఎన్టీ, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ, డెవలప్మెంటల్ పీడియాట్రిక్స్, చైల్డ్ సైకియాట్రీ స్పెషలిస్ట్లతో సహా న్యూరో డెవలప్మెంట్కేర్ తదితర పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్యాన్ని అంచనా వేస్తున్నారు. అవసరమైతే సీటీ, 2డీ-ఈకో ఎక్స్రే, అల్ట్రా సౌండ్, కార్యో టైపింగ్, జెనెటిక్ మూల్యాంకనం-క్రోమోజోమల్ మైక్రో-అరే, హోల్ ఎక్సోమ్ సీక్వెన్సింగ్ వంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు.