శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునుల క్షేత్రంలో గురువారం ముక్కోటి ఏకాదశి పర్వదినం వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిధ్ధంచేసినట్లు దేవస్థాన కార్యనిర్వాహణాధికారి లవన్న తెలిపారు. గురువారం తెల్లవారుజామున మేళతాళాలతో ఆలయ ద్వారాలు తెరిచి ఏకాంత సుప్రభాత సేవ మంగళహారతుల అనంతరం స్వామిఅమ్మవార్లను ముఖమండపంలో ఆసీనులనుజేసి ఉత్సవ మూర్తులకు విశేష పూజాధికాలు నిర్వహించనున్నారు.
ఉత్తర ద్వారం నుండి స్వామిఅమ్మవార్లను వెలుపలకు తీసుకొనివచ్చి బలిపీఠం వద్ద ఉత్తరముఖంగా ప్రత్యేక పూజలు నిర్వహించి రావణవాహన సేవను వైభవంగా నిర్వహించనున్నారు. గ్రామోత్సవంలో భాగంగా ఆలయ మాఢవీధులో ఉత్సవ మూర్తులు రావణ వాహనంపై విహరించనున్నారు. ఉదయం 6 గంటల నుండి భక్తులకు ఉత్తర ద్వారం నుండి సర్వదర్శనాలు కల్పించినట్లు ఈవో చెప్పారు.