యాదాద్రి, డిసెంబర్ 24: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంతోపాటు అనుబంధ పాతగుట్ట దేవాలయంలో జనవరి 2న ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకల సందర్భంగా స్వామివారు భక్తులకు ఉత్తర ద్వార దర్శనమివ్వనున్నట్టు ఈవో గీత తెలిపారు. ఉదయం 6.48 గంటల నుంచి ప్రధానాలయం ఉత్తరద్వార ప్రవేశం కల్పించనున్నట్టు చెప్పారు. జనవరి 2 నుంచి 7 వరకు స్వామివారి అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా భక్తులతో నిర్వహించే సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత కల్యాణం, నిత్య, శాశ్వత బ్రహ్మోత్సవాలు రద్దు చేయనున్నట్టు తెలిపారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆరు రోజుల పాటు ఉదయం, సాయంత్రం స్వామివారి ఆలంకార సేవలు వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. భక్తులతో ఊరేగించే వెండి మొక్కు జోడు సేవలను జనవరి 2 నుంచి 6 వరకు సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఆలయ చరిత్రలో తొలిసారిగా స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమివ్వనున్నట్టు తెలిపారు. కాగా, వరుస సెలవులు రావడంతో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులతో తిరుమాడవీధులు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల ప్రాంగణం సందడిగా మారాయి. స్వామివారిని 33 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి ఖజానాకు రూ.36,02,552 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్ గీత తెలిపారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో దేవస్థాన తూర్పు మాడవీధుల్లో స్వర మహతి కళాపరిషత్ ఆధ్వర్యంలో నృసింహ నర్తనం-2022 కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. చిన్నారుల నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
ఎత్తు 55 అడుగులు
కృష్ణశిల 3,600 టన్నులు
నిర్మించేందుకు పట్టిన సమయం 14 నెలలు
మొదటినుంచీ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారు తూర్పు ద్వారం గుండా దర్శనమిస్తూ వస్తున్నారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో ఉత్తర ద్వారాన్ని సైతం ఆలయ సంప్రదాయరీతిలో తీర్చిదిద్దారు.
దీంతో ఈ పండుగకు ఆలయ చరిత్రలోనే తొలిసారిగా ఉత్తర ద్వార దర్శన భాగ్యం భక్తులకు కలుగనున్నది. ఇక నుంచి స్వామివారు ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి రోజు ఉత్తర ద్వారం గుండానే భక్తులకు దర్శమివ్వనున్నారు.